ఆఫర్లు ఫుల్..సేల్స్ నిల్

ఆఫర్లు ఫుల్..సేల్స్ నిల్

హైదరాబాద్, వెలుగుసీజన్ ను బట్టి ఫ్యాషన్ విషయంలో ట్రెండీగా ఉండాలనుకునే సిటిజన్స్​ లాక్ డౌన్ తో 2 నెలలుగా షాపింగ్​కు దూరమయ్యారు. లాక్ డౌన్ రిలాక్సేషన్స్ తో క్లాత్ షోరూమ్​లు, రెడీమేడ్ షాప్ లు తెరుచుకున్నా.. ఇప్పుడు షాపింగ్ కి ఇంట్రెస్ట్ చూపడం లేదు. సేఫ్టీ, సెక్యూర్ మెజర్ మెంట్స్ తో సరి–బేసి సిస్టమ్ లో షోరూమ్ లు ఓపెన్ చేస్తున్నా, తప్పనిసరి అయితే తప్ప కస్టమర్లు రాట్లేదని ఓనర్లు చెప్తున్నారు. ఆఫర్లు పెట్టినా యూజ్ ​ఉండడం లేదంటున్నారు.

సేఫ్టీ ప్రికాషన్స్..

హైదరాబాద్ లో నార్మల్​ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండెడ్​ వరకూ షోరూమ్​లు ఉన్నాయి. జీహెచ్​ఎంసీ నిబంధనల మేరకు అన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ ​పాటిస్తున్నాయి. ఎంట్రెన్స్ దగ్గరే సిబ్బంది టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. మాస్క్ తప్పనిసరి చేశారు. మాస్క్ తెచ్చుకోని వారికి కొనిచోట్ల ఫ్రీగా ఇస్తున్నారు. శానిటైజ్ ​చేసిన తర్వాతే  లోపలికి పంపిస్తున్నారు. ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెన్ చేసేలా చైర్స్ వేస్తున్నారు. లాక్ డౌన్​తో సగానికిపైగా స్టాఫ్ సొంతూళ్లకు వెళ్లిపోగా, ఉన్నవారితోనే నడిపిస్తున్నారు. షోరూమ్​ను రెగ్యులర్​గా శానిటైజ్​చేయడంతోపాటు స్టాఫ్​కి టెంపరేచర్ చెకప్, మాస్క్, గ్లౌస్​లు ఉండేలా చూసుకుంటున్నట్టు వ్యాపారులు చెప్పారు. అయినా 15–20 శాతమే బిజినెస్ అవుతోందని తెలిపారు. 3 నెలల ముందే స్టాక్ తెచ్చుకుని గోడౌన్లలో పెట్టామని, ఇప్పట్లో అది సేల్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం షాపింగ్ చేస్తున్న వారు సమ్మర్, కాటన్ వేర్ కొంటున్నారని.. లాక్ డౌన్ కి ముందున్న రేట్లనే కంటిన్యూ చేస్తున్నామని పేర్కొన్నారు. కొంత  స్టాక్​పై వన్ ప్లస్ వన్ ఆఫర్, 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు చెప్పారు. కరోనాతో మ్యారేజెస్  పోస్ట్​పోన్, క్యాన్సిల్ కావడం వల్ల వెడ్డింగ్ కలెక్షన్ వైపు ఎవరూ రావడం లేదంటున్నారు.

150 మంది కూడా వస్తలేరు

లాక్ డౌన్ రూల్స్ తో సాయంత్రం 5.30కి షాప్ క్లోజ్ చేయాలె. సమ్మర్​లో జనం బయటికి వచ్చేదే అప్పుడు. ఆ టైమ్ లో క్లోజ్ ఉండటంతో బిజినెస్ జరుగతలేదు. జనం షాపింగ్ చేయాలని కాకుండా, అవసరముంటేనే కొనేందుకు వస్తున్నారు. ఇంతకుముందు డైలీ 2 వేల మంది వచ్చేవాళ్లు. ఇప్పుడు 150 మంది కూడా వస్తలేరు.

‑ మల్లెబాబు, సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్, ప్యాట్నీ సెంటర్

 ట్రయల్ ఫెసిలిటీ లేదు

సమ్మర్ వేర్ కొనాలనుకున్నా లాక్ డౌన్ తో కుదరలేదు. షోరూమ్ లు ఓపెన్ కావడంతో 2 నెలల తర్వాత షాపింగ్ చేశా.  ఇప్పుడు ట్రయల్ ఫెసిలిటీ లేదు.  సైజ్ ని బట్టి షాపింగ్ చేసుకోవాలంటున్నారు.సైజ్ సరిగ్గా లేకపోతే ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని నిర్వాహకులు చెప్పారు.

‑ కావ్య, ముషీరాబాద్