- లేనికేసు ఉన్నట్టుగా మసిపూసి మారేడుకాయ చేస్తున్నరు: కేటీఆర్
- లబ్ధిపొందారని చెబుతున్న కంపెనీ పేరు చార్జిషీట్లో ఎందుకు చేర్చలేదు?
- ఫార్ములా ఈ కేసులో చార్జిషీటుపై మీడియాతో చిట్చాట్
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లేని కేసు ఉన్నట్టుగా మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో కేటీఆర్ను ఏ1గా పేర్కొంటూ ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీటుపై మంగళవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో చిట్ చాట్చేశారు.
ఆరు గ్యారంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టేందుకు అనుమతివ్వాలని స్పీకర్ను కోరామని, దాని నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం మళ్లీ దీనిని బయటకు తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ కేసులో ఎవరికి లబ్ధి జరిగిందని ప్రభుత్వం చెబుతున్నదో.. ఆ కంపెనీ పేరును కనీసం చార్జిషీటులో చేర్చలేదన్నారు.
డబ్బు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినట్టు ఉందని, అలాంటప్పుడు ఆ డబ్బును ప్రభుత్వం ఎందుకు రికవరీ చేయడం లేదని ప్రశ్నించారు. ‘‘హైదరాబాద్ ఇమేజ్ పెంచటానికి ఫార్ములా ఈ రేస్ చేపట్టాం. కానీ, ఈ ప్రభుత్వం రూ.200 కోట్లు పెట్టి మిస్వరల్డ్ పోటీలు పెట్టి రాష్ట్రం, దేశపరువు పోయేలా చేసింది. మెస్సీతో ఫుట్బాల్ ఆట పేరిట రూ.వంద కోట్లు ఖర్చు చేశారు. దీనిపై ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేశారు? సీఎం రేవంత్ నుంచి రికవరీ చేస్తారా? అక్రమ కేసులపై మేం కోర్టును ఆశ్రయిస్తం. ఫార్ములా ఈ రేస్లో క్విడ్ ప్రోకో జరగలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.
మూసీపై చర్చ ప్రజల దగ్గర పెట్టాలె
మూసీపై చర్చ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల వద్ద కాకుండా.. ప్రజల వద్ద పెట్టాలని కేటీఆర్ సవాల్ చేశారు. టీడీఆర్ అతిపెద్ద స్కామ్ అని, కృత్రిమ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. టీడీఆర్లను రేవంత్ కుటుంబ సభ్యులు.. ఏటీఎంలా మార్చుకున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ చేయిస్తామన్నారు. అసెంబ్లీ సీట్లు పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దక్షిణాది రాష్ట్రల్లో సీట్లు తగ్గించే ప్రయత్నం చేయొద్దన్నారు. అసలు డీలిమిటేషన్ ఎప్పుడో జరగాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని చెప్పారు. పార్లమెంట్లో దక్షిణాదికి 24 శాతం ప్రాతినిధ్యం ఉందని, యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
గ్యాస్ బండను 10 కిలోలు చేస్తరు
దేశమంతటా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటరీల దగ్గర ప్రజలు క్యూలు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు. దేశంలో గ్యాస్ కొరత, రాష్ట్రంలో సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్పార్క్ వద్ద, అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఎంట్రీ పాయింట్ వద్ద నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గ్యాస్ కొరత లేదని కేంద్రం చెప్తుంటే.. కొరత ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదని అన్నారు.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 4 నుంచి సిలిండర్ సైజ్ను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. 14 కిలోల బండను 10 కిలోలకు తగ్గించబోతున్నదన్నారు. దివ్యాంగులు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మంగళవారం అసెంబ్లీ బయట పలువురు దివ్యాంగులు కేటీఆర్ను కలిశారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ దివ్యాంగులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
