రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తట్టెడు మట్టి పోసిందా?

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తట్టెడు మట్టి పోసిందా?

హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రెండో రోజు ఇవాళ కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో భట్టి కేంద్ర విద్యుత్ బిల్లుపై మాట్లాడారు. ఉమ్మడి జాబితాలోని విద్యుత్ పై కేంద్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే కొత్త విద్యుత్ బిల్లును తీసుకొచ్చిందని మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లులపై అభ్యంతరాలున్నాయన్నారు. కేంద్రం చట్టం తెచ్చి రాష్ట్రాలు అమలు చేయాల్సిందే అనడం సరికాదన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జాతి సంపదను అమ్ముకుంటూ పోతోందని, సంపదనంతా ఇద్దరి చేతుల్లో పెడుతోందని ఫైర్ అయ్యారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సమస్య ఉంటుందని, కానీ కేంద్రం రైతుల మోటర్లకు మీటర్లు పెడుతాననడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. ఉచితాలు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, కానీ ప్రజలకు ఇచ్చిన ఉచితాలతో పోల్చుకుంటే పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన సబ్సిడీలు, రుణ మాఫీలు చాలా ఎక్కువ అని అభిప్రాయపడ్డారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని బీజేపీ నాయకులు చెబుతున్నారని, సింగిల్ ఇంజిన్ తో ప్రజలకు అభివృద్ధి చేయలేమా అంటూ ప్రశ్నించారు.

ప్రతి పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులివ్వకుండా డబుల్ ఇంజిన్ పేరుతో డ్రామాలాడుతున్నారని బీజేపీ నాయకులపై ఫైర్ అయ్యారు. చట్టపరంగా రాష్ట్రాలకు రావాల్సిన వాటాలను అడ్డుకుంటూ కక్షసాధింపు చర్యలకు మోడీ పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ కోవలోనే రకరకాల చట్టాలు తెస్తూ రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేస్తున్నారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం ప్రభుత్వం తట్టెడు మట్టిపోసిందా అని ప్రశ్నించారు. మోడీ ఫోటోలు పెట్టాలని బీజేపీ మంత్రులు ఏకంగా ఓ కలెక్టర్ నే బెదిరించడం సిగ్గు చేటన్నారు.  అంతకు మందు పోలీస్ రిక్రూట్ మెంట్ సమస్యలపై మాట్లాడానికి ప్రయత్నించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి అడ్డుకున్నారు. సబ్జెక్ట్ పైనే మాట్లాడాని మంత్రి భట్టికి సూచించారు. అయితే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సమయం కేటాయించాలని భట్టి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరారు.  గురుకులాల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.