
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇవాళ (సోమవారం) శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలంతా హాజరుకావాలని ఆదేశించారు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య. ఎమ్మెల్యేల రాజీనామాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక అసమ్మతి నేతల్లో కీలకంగా ఉన్న మాజీ మంత్రి రామలింగారెడ్డితో.. డిప్యూటీ సీఎం పరమేశ్వర, సీఎల్పీ నేత సిద్ధరామయ్య సమావేశమయ్యారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరారు. బెంగళూరులో కేకే గెస్ట్ హౌస్ లో సీఎం కుమారస్వామి, మంత్రి డీకే శివకుమార్ , మాజీ ఎంపీ మల్లికార్జునఖర్గే, ఇతర ముఖ్యనేతలు సమావేశమై చర్చించారు. కర్ణాటక సంక్షోభానికి బీజేపీనే కారణమని ఆరోపించారు మంత్రి డీకే శివకుమార్. తమకు సంబంధం లేదని చెబుతున్న బీజేపీ నేతలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్వయంగా ఫ్లైట్లలో ముంబై తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా విశ్వాసపరీక్షలో గెలిచితీరుతామని ధీమా వ్యక్తం చేశారు.