ప్రధాని మోడీకి జగన్ లేఖ..కోవాగ్జిన్ టెక్నాలజీ బదిలీ చేయాలని వినతి

ప్రధాని మోడీకి జగన్ లేఖ..కోవాగ్జిన్ టెక్నాలజీ బదిలీ చేయాలని వినతి

అమరావతి:ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. ఆక్సిజన్‌ కేటాయింపులు, సరఫరాను పెంచేందుకు సహకరించాలని లేఖలో కోరారు. ఏపీకి ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్నా అది ఏమాత్రం సరిపోవడం లేదని, కనీసం 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజెన్ సరఫరా చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని కోరారు.  పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్‌ దిగుమతి తెచ్చుకుంటున్నా అది సరిపోవడం లేదని.. అలాగే సరఫరా నిరాటంకంగా జరిగేందుకు 20 ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఏపికి మంజూరు చేయాలని కోరారు
ఆలస్యం కావడం వల్లే తిరుపతిలో 11 మంది మృతి
ఈనెల 10న చెన్నై, కర్ణాటక నుంచి ఆక్సిజన్‌ రావడం ఆలస్యమవ్వడంతో తిరుపతిలో 11 మంది చనిపోయారని ఈ సందర్భంగా జగన్ ప్రధానికి తెలియజేశారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను 150 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని కోరారు. అలాగే ప్రస్తుతం ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్న...210 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను 400 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని, కోవాగ్జిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు... టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని లేఖలో కోరారు. పెద్ద మొత్తంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరి అవుతోందని.. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి...ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలు సహకరించాయని, ఇతర వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోడీని కోరారు.