
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా ఇస్లాం మతస్థులు జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ హా) (జూలై10) అని సీఎం అన్నారు. భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్ పండుగ చాటి చెప్తుందని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవునిపై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ పండుగ మానవాళికి ఇస్తున్నదని సీఎం కేసిఆర్ చెప్పారు. తమకు కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ పండుగ కలిగిస్తుందని సీఎం పేర్కొన్నారు.