
వీఆర్ఏల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వీఆర్ఏల విద్యార్హతలు, సామర్థ్యాన్ని బట్టి ఇరిగేషన్తో సహా ఇతరశాఖల్లో సర్దుబాటు చేసి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వీఆర్ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్లతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉప సంఘం వీఆర్ఏలతో జులై 12వ తేదీ బుధవారం నుంచి చర్చలు ప్రారంభించనున్నది. చర్చల అనంతరం ఉప సంఘం సూచనల ప్రకారం.. నిర్ణయాలు తీసుకోని వీఆర్ఏల సేవలను వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉప సంఘం కసరత్తు పూర్తై..తుది నివేదిక సిద్ధమైన తర్వాత మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.