సీనియర్ ఎమ్మెల్యేకు అవమానం.. నిండు సభలో ఇజ్జత్ తీసిన సీఎం కేసీఆర్

సీనియర్ ఎమ్మెల్యేకు అవమానం.. నిండు సభలో ఇజ్జత్ తీసిన సీఎం కేసీఆర్

నిండు సభలో సొంత పార్టీ ఎమ్మెల్యేను సీఎం కేసీఆర్ అవమానించారు. మంచిర్యాల  జిల్లాలో నిర్వహించిన  బీఆర్ఎస్ ప్రగ‌తి నివేదన స‌భ‌లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కకు తోసేశారు. సీనియర్ ఎమ్మెల్యే అని చూడకుండా..చుట్టూ మంత్రులు, సహచర ఎమ్మెల్యేలు ఉన్నా కూడా..ఎమ్మెల్యే దివాకర్ రావును సీఎం కేసీఆర్ అడ్డుకున్నారు. 

ఏమైందంటే..

జూన్ 9వ తేదీన సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని  ప్రారంభించారు. అనంతరం ప్రగతినివేదన సభలో పాల్గొన్నారు. ప్రసంగం ముగిసిన తర్వాత సభ వేదిక నుంచి దిగుతున్న సమయంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు సీఎం కేసీఆర్ ను శాలువాతో సత్కరించేందుకు ప్రయత్నించారు. కానీ సీఎం కేసీఆర్ ఆయన్ను చీదరించుకున్నారు.  శాలువా కప్పుతుంటే పక్కకు తోసేశారు. 

అవమాన భారంతో..

ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రేమతో శాలువాతో సత్కరించాలి అనుకున్న ఎమ్మెల్యే దివాకర్ రావుకు చుక్కెదురైంది. తన అభిమాన నాయకుడే పక్కకు తోసేయడంతో ఎమ్మెల్యే దివాకర్ రావు అవమానం భారంతో వెనకే ఉండిపోయారు. ముఖ్యమంత్రికి కప్పాలి అనుకున్న శాలువాను చేతిలో పట్టుకున్నారు. ఆ తర్వాత సీఎం కాన్వాయ్ బస్ లో ఎక్కే సమయంలో కొద్దిగా దూరంగా నిల్చున్నారు. 

నాలుగు సార్లు ఎమ్మెల్యే..

కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దివాకర్ రావు..1981లో మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా విజయం సాధించారు.  1983–1992 వరకు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 1987లో ఆసిఫాబాద్ డివిజన్‌లోనే అత్యధిక మెజారిటీతో మంచిర్యాల మండల సింగల్ విండో చైర్మన్‌గా గెలుపొందారు. ఆ తరువాత 1989 నుండి 1999 వరకు పదేండ్లపాటు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1999, 2004లో రెండుసార్లు  లక్సెట్టిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్  అభ్యర్థి గడ్డం అరవింద్ రెడ్డిపై 59 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం  నాలుగు సార్లు మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యునిగా గెలిచారు. 2018లో జరిగిన ఎన్నికల్లో  టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కోకిరాల ప్రేమ్ సాగర్ రావుపై 4 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో  గెలుపొందారు.