భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అభివృద్ధి పనులకు రూ.68.8 కోట్ల నిధులు కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం తుది జాబితా ఖరారైంది. ఇరిగేషన్ శాఖ ద్వారా స్నాన ఘట్టాలు, ఇతర పనులకు రూ.46.7 కోట్లు, రోడ్ల నిర్మాణాలకు ఆర్అండ్బీ శాఖకు రూ.17.6 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.3 కోట్లు, ఎండోమెంట్స్ శాఖకు రూ.1.50 కోట్లు మంజూరు చేశారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పాత కూరగాయల మార్కెట్ నుంచి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏ రోడ్డును రూ.2.10 కోట్లతో నిర్మించనుంది. అలాగే హనుమాన్ టెంపుల్ నుంచి రామాలయం వరకు రూ.90 లక్షలతో బీటీ రోడ్డును అభివృద్ధి చేయనుంది. దేవస్థానానికి కేటాయించిన రూ.1.50 కోట్లతో అంబసత్రం సమీపంలో భక్తుల కోసం జీ ప్లస్-1 నమూనాలో డార్మెటరీ హాల్ నిర్మించనున్నారు. ఇందులో సుమారు 600 మంది భక్తులు విశ్రాంతి తీసుకునే సౌకర్యం కల్పించనున్నారు.
