యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

 

 

    పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు
  
మంథని, వెలుగు: ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ​ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను నాణ్యతతో నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని.. నిర్లక్షం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం మంథని పట్టణంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. అనంతరం ఓ ఫంక్షన్​ హాల్​లో ఏర్పాటు చేసిన ఉచిత కానిస్టేబుల్, ఎస్సై కోచింగ్ సెంటర్​ను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, ప్రస్తుతం మరో 7 వేలకుపైగా పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. కోచింగ్ సెంటర్​లో అత్యుత్తమ శిక్షణతో పాటు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్, వసతి, భోజన సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.

 పరిశ్రమలకు ప్రభుత్వం పూర్తి సహకారం

మంథని క్యాంపు కార్యాలయంలో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్, ఇతర పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశ్రమల అభివృద్ధి అంశాలపై సమీక్షించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. బొక్కలవాగు చెక్​డ్యామ్ అప్​గ్రేడేషన్, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. బొక్కలవాగులో డీ-సిల్టింగ్ పనులు చేపడుతున్నామని.. వాగు వద్ద గార్డెనింగ్, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం పార్కు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సివిల్ ఆస్పత్రిలో డెవలప్​మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొని వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో సురేశ్, మున్సిపల్ చైర్మన్  శ్రీనివాస్, సయేందర్ రెడ్డి, శశి భూషణ్ కాచే, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.