ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ హైదర్‌గూడలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ రిబ్బన్‌ కట్‌ చేసి ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ను ప్రారంభించారు. హైదర్‌ గూడలో 4.5 ఎకరాల స్థల విస్తీర్ణంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్వార్టర్లను ప్రభుత్వం నిర్మించింది.  కార్యక్రమంలో  అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలు పాల్గొన్నారు.

120 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,సహాయకులకు, అసెంబ్లీ సిబ్బందికి … 4.26 ఎకరాల స్థలంలో రూ.166 కోట్లతో నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఫ్లోర్‌లో పదిచొప్పున 12 అంతస్తుల్లో 120 క్వార్టర్స్‌ను నిర్మించారు. ఒక్కోక్వార్టర్‌ను మూడు బెడ్‌రూంలతో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో.. మొత్తం 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టారు. వీటికి అనుబంధంగా 325 చదరపు అడుగుల చొప్పున 120 సర్వెంట్ క్వార్టర్స్‌ను, సిబ్బందికి 36 క్వార్టర్స్ ఉన్నాయి. ఒక్కో సభ్యుడికి రెండుకార్లకు అవసరమైన పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 23 సమావేశ క్యాబిన్లను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలను కలువడానికి వీలుగా వీటిని నిర్మించారు.