బెల్లంపల్లి రూరల్, వెలుగు: తన భూమిని వేరే వ్యక్తుల పేరిట పట్టా చేశారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా భీమిని తహసీల్దార్ ఆఫీస్ ఆవరణలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని చిన్నగుడిపేటకు చెందిన రెడ్డి స్వామి సర్వే నంబర్ 107లో ఉన్న భూమిని తాను కాస్తు చేస్తున్నప్పటికీ, ఆ భూమిని మరొకరికి పట్టా చేశారని వాపోయాడు.
తన వెంట పురుగుల మందు డబ్బా తెచ్చుకున్న బాధితుడు భార్య, పిల్లలతో కలిసి తాగేందుకు యత్నించాడు. ఎస్సై కోటేశ్వర్ సిబ్బందితో అక్కడికి చేరుకొని పురుగుల మందు డబ్బాను లాక్కొన్నారు. అనంతరం బాధితుడు తనను మోసం చేసిన ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

