
హైదరాబాద్, వెలుగు: వడ్లతో బియ్యం మాత్రమేగాకుండా నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వడ్లను ప్రాసెసింగ్ చేసే జపాన్కు చెందిన సటేక్ కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం సోమవారం సెక్రటేరియట్లో సమావేశమయ్యారు. తర్వాత మంత్రి గంగుల కమలాకర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారితో రివ్యూ జరిపారు.
రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గంటకు 60 నుంచి 120 టన్నుల బియ్యాన్ని ఆడించే రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సివిల్ సప్లైస్ శాఖ ఏర్పాటు చేయనున్న రైస్ మిల్లులకు అనుసంధానంగా రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి చేసే మిల్లులను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.