
హైదరాబాద్ : కరోనా నియంత్రణలో పోలీసులు, మున్సిపల్ అధికారులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు కానీ.. ప్రజా ప్రతినిధులు ఎక్కడున్నారని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. కరోనా కట్టడి విషయంలో ప్రజా ప్రతినిధులు కనిపిస్తలేరని.. కార్పోరేటర్లు ఏంజేస్తున్నారన్నారు. కరోనా కట్టడి చర్యలు, లాక్ డౌన్ పరిస్థితులపై మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ఆపద సమయాల్లోనే ప్రజా ప్రతినిధులు ప్రజలకు అండగా నిలబడాలని తెలిపారు. ఎమ్మెల్యే నుంచి సర్పంచ్ వరకు అందరూ కరోనా కంట్రోల్ పై అవగాహన కల్పించాలన్నారు సీఎం.
గ్రామాల్లో సర్పంచ్, MPTC, వార్డు సభ్యలు కరోనాపై నడుం బిగించాలన్నారు కేసీఆర్. కరోనా మీద అవగాహన తెచ్చే క్రమంలో పాజిటివ్ డైరెక్షన్లో ముందుకు పోవాలన్నారు. ప్రతి సర్పంచ్ ఆ గ్రామానికి కథానాయకుడు కావలని.. ఈ సమయంలోనే నాయకులు ప్రజల కోసం పనిచేయాలన్నారు. మంత్రులంతా జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండాలన్న సీఎం. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో ఉండాలన్నారు సీఎం కేసీఆర్.
మీడియాకు అనుమతి తప్పనిసరి
మీడియా ప్రతినిధుల పట్ల కొందరు పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని .. ఇక నుంచి అలా జరగదని తెలిపారు సీఎం కేసీఆర్. వార్తల సేకరణలో మీడియా ప్రతినిధులు రోడ్లపై తిరగడం తప్పనిసరని.. ప్రభుత్వమే వారికి అనుమతి ఇచ్చిందన్నారు. కరోనాపై టీవీల్లో మంచి అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు సీఎం కేసీఆర్.