- ముందే డబ్బులు తీసుకుని అ‘ధనం’ కోసం డిమాండ్
- ఇవ్వకపోతే ఫోన్ కాంటాక్ట్స్హ్యాక్
- ఇన్స్టా, ఫేస్బుక్లో ఫొటోల మార్ఫింగ్
- బంధువులకు పంపి బ్లాక్మెయిల్
- నగరంలో ఎందరో బాధితులు
- అరెస్ట్ చేసిన మార్కెట్ పోలీసులు
పద్మారావు నగర్, వెలుగు : అతడు చదివింది ఇంటర్. క్యాటరింగ్ కార్మికులను సరఫరా చేసే పని చేస్తుంటాడు. కానీ, చేసిన పనికి మాట్లాడుకున్న డబ్బు తీసుకుని ఆగిపోడు. ఏదో తప్పు చూపి అదనంగా డబ్బులు కావాలని డిమాండ్చేస్తాడు. ఇవ్వకపోతే అతడి ఫోన్హ్యాక్చేస్తడు. కాంటాక్ట్స్తీసుకుని ముందు సోషల్మీడియాలో వల్గర్మెసేజ్లు పెట్టి వేధిస్తడు.
అయినా వినకపోతే ఇన్స్టా, ఫేస్బుక్లో బాధితుల భార్య, పిల్లల ఫొటోలు తీస్కుంటడు. వాటిని మార్ఫింగ్చేసి కాంటాక్ట్లిస్టులో ఉన్న అందరికీ పంపిస్తానని బ్లాక్మెయిల్చేస్తడు. దీంతో నూటికి 99 మంది డబ్బులు ఇచ్చేవారు. దీంతో ఇదే పనిగా పెట్టుకుని చివరకు సికింద్రాబాద్మార్కెట్పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
ఇంటర్ చదివినా హ్యాకింగ్ పై పట్టు
సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ఇన్ స్పెక్టర్ వి.రామచంద్రం కథనం ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన ముదిరాజ్ వన్నూరు స్వామి అలియాస్ అంజి కిరణ్ అలియాస్ అభి (34) ఇంటర్చదివాడు. ఉపాధి కోసం కొంతకాలం కింద నగరానికి వచ్చి యూసుఫ్గూడ రహ్మత్నగర్లో ఉంటూ క్యాటరింగ్ కార్మికులను సరఫరా చేసే బిజినెస్చేస్తున్నాడు. ఇతడికి కంప్యూటర్పై అవగాహన ఉంది..ఈ క్రమంలో హ్యాకింగ్పై పట్టు సంపాదించాడు.
ఈ మధ్య సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి జస్ట్ డయల్ ద్వారా క్యాటరింగ్ కార్మికులను బుక్ చేసుకున్నాడు. దీంతో ముందు మాట్లాడుకున్న మొత్తం కాకుండా ఎక్కువ ఇవ్వాలని అభి డిమాండ్చేశాడు. ఇవ్వకపోవడంతో తన విశ్వరూపాన్ని చూపించాడు. బాధితుడి ఫోన్హ్యాక్చేసి బంధువుల కాంటాక్ట్స్సేకరించాడు. బాధితుడికి, అతడి కుటుంబసభ్యులకు అసభ్యకర మెసేజ్లు పంపాడు.
వినకపోవడంతో సోషల్మీడియా అకౌంట్లు హ్యాక్చేసి ఫొటోలు అసభ్యంగా మార్ఫింగ్చేశాడు. వాటిని సోషల్మీడియాలో పెడతానని బెదిరించాడు. కొంతమంది బంధువులకు కూడా పంపడంతో భయపడి కొంత డబ్బు చెల్లించాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్చేశారు.
