హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ సెషన్–2 పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రవేశ పరీక్షల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సెషన్కు తెలంగాణ నుంచి సుమారు 80వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
సెషన్–1లో ఆశించిన స్కోరు సాధించని వారు, స్కోరును మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నవారు కూడా ఈ సెషన్ ఎగ్జామ్ రాయనున్నారు. 9వ తేదీ వరకూ ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.
మొదటి షిఫ్ట్ విద్యార్థులు ఉదయం 7.30 గంటలకే, రెండో షిఫ్ట్ వారు మధ్యాహ్నం 1 గంటకే రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్లోనే అత్యధికంగా సెంటర్లు ఉండగా.. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం, సూర్యాపేట, సిద్దిపేట వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ సెంటర్లు కేటాయించారు.
పరీక్షకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తో పాటు ఒక ఒరిజినల్ ఐడీ కార్డు (ఆధార్, పాన్ లేదా ఓటర్ ఐడీ), అడ్మిట్ కార్డుపై అంటించిన ఫొటోనే కాకుండా అదనంగా మరో ఫొటోను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎగ్జామ్ కు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ నిబంధనను పక్కాగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
