ఢిల్లీలో బీఆర్​ఎస్​ కార్యాలయం రెడీ.. మే 4న ప్రారంభించనున్న కేసీఆర్​

ఢిల్లీలో బీఆర్​ఎస్​ కార్యాలయం రెడీ.. మే 4న  ప్రారంభించనున్న కేసీఆర్​

ఢిల్లీలో నిర్మించిన BRS నూతన కార్యాలయాన్ని మే 4న సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా రేపు మధ్యాహ్నం ఒంటిగంటా 5 నిముషాలకు ఢిల్లీలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభానికి ముస్తాబవుతోంది. 20వేల చదరపుగజాల్లో 1300 గజాల్లో నిర్మించిన ఐదంతస్థుల భవంతిలో అధ్యక్షుడి గదితో పాటు మరో నలుగురు కార్యదర్శులకు ప్రత్యేక గదులు నిర్మించారు. 40 మందికూర్చునేందుకు వీలుగా కాన్ఫరెన్స్‌ హాల్‌ నిర్మించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 200 మంది ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. టీఆర్​ఎస్..బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. జాతీయస్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడువనున్నాయి. వివిధ పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకురావడం, సదస్సులు, సమావేశాలకు పార్టీ కార్యాలయం ఒక వేదికగా పనిచేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం కేసీఆర్ రేపు ( మే4) మధ్యాహ్నం 12.30 గంటలకు  ఢిల్లీకి చేరుకుంటారు.

ఢిల్లీలోని వసంత్ విహార్ లో 2021 సెప్టెంబర్లో భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇపుడు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం తొలుత ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో తాత్కాలిక కార్యాలయాన్ని డిసెంబర్ 14న కేసీఆర్ ప్రారంభించారు. ఇది కేవలం ఒక గుర్తింపు కోసం మాత్రమే ఏర్పాటు చేసినట్లు అప్పుడే పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా శాశ్వత భవనం పూర్తి కావడంతో మే 4న  అట్టహాసంగా పార్టీ కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించారు. ఇకపై బీఆర్ఎస్ జాతీయ స్థాయి కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచే నడుస్తాయని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.