ఇయ్యాల షోలాపూర్​కు కేసీఆర్

ఇయ్యాల షోలాపూర్​కు కేసీఆర్
  • రెండ్రోజులు మహారాష్ట్రలో పర్యటన

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ​చీఫ్, సీఎం కేసీఆర్ సోమవారం మహారాష్ట్రలోని షోలాపూర్​కు వెళ్తున్నారు. తనతో పాటు మహారాష్ట్రకు రావాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా పలువురు ముఖ్య నేతలకు ప్రగతి భవన్​ నుంచి ఫోన్లు చేసిన ఆహ్వానించినట్లు తెలిసింది. ఉదయం ప్రగతి భవన్​లోనే ప్రజా ప్రతినిధులందరికీ బ్రేక్​ఫాస్ట్​ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వందలాది వాహనాలతో భారీ కాన్వాయ్​గా కేసీఆర్, ఇతర నేతలు షోలాపూర్​కు బయల్దేరుతారు. సాయంత్రం అక్కడి బీఆర్ఎస్ ​నేతలు, తెలంగాణకు చెందిన చేనేత కార్మికులతో సమావేశమవుతారు.

రాత్రికి షోలాపూర్​లో బస చేస్తారు. మంగళవారం ఉదయం పండరీపూర్​కు వెళ్లి అక్కడి విఠోభా రుక్మిణి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు కేసీఆర్ ​సమక్షంలో బీఆర్ఎస్​లో చేరుతారు. తిరుగు ప్రయాణంలో దారాశివ్​ జిల్లాలోని తుల్జాభవాని ఆలయంలో కేసీఆర్ పూజలు చేస్తారని ఆ పార్టీ ​నేతలు వెల్లడించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ​కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఐదోసారి కేసీఆర్​ ఆ రాష్ట్రానికి వెళ్తున్నారు.