- రెండ్రోజులు మహారాష్ట్రలో పర్యటన
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ సోమవారం మహారాష్ట్రలోని షోలాపూర్కు వెళ్తున్నారు. తనతో పాటు మహారాష్ట్రకు రావాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా పలువురు ముఖ్య నేతలకు ప్రగతి భవన్ నుంచి ఫోన్లు చేసిన ఆహ్వానించినట్లు తెలిసింది. ఉదయం ప్రగతి భవన్లోనే ప్రజా ప్రతినిధులందరికీ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వందలాది వాహనాలతో భారీ కాన్వాయ్గా కేసీఆర్, ఇతర నేతలు షోలాపూర్కు బయల్దేరుతారు. సాయంత్రం అక్కడి బీఆర్ఎస్ నేతలు, తెలంగాణకు చెందిన చేనేత కార్మికులతో సమావేశమవుతారు.
రాత్రికి షోలాపూర్లో బస చేస్తారు. మంగళవారం ఉదయం పండరీపూర్కు వెళ్లి అక్కడి విఠోభా రుక్మిణి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతారు. తిరుగు ప్రయాణంలో దారాశివ్ జిల్లాలోని తుల్జాభవాని ఆలయంలో కేసీఆర్ పూజలు చేస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఐదోసారి కేసీఆర్ ఆ రాష్ట్రానికి వెళ్తున్నారు.