
భారత్ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్ధతు తెలుపుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ లో సంతోష్ బాబు కుటుంబ అవసరాల రీత్యా రూ. 5 కోట్ల నగదు, ఇంటి జాగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. అదే విధంగా గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని, అది కూడా వారికి ఆసక్తి ఉన్న ఉద్యోగమే ఇవ్వాలని కేసీఆర్ ఆలోచనగా మంత్రి చెప్పారు. సంతోష్ బాబు సేవలకు గుర్తుగా, యువతకు స్పూర్తిగా ఉండాలని కేసీఅర్ భావిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ సాయంపై తనను వ్యక్తిగతంగా సంతోష్ బాబు కుటుంబాన్ని కలిసి చెప్పమన్నట్టు సీఎం చెప్పారన్నారు.
ప్రభుత్వ సాయాన్ని సంతోష్ బాబు కుటుంబం సంతోషంగా ఒప్పుకుందని, తమతో పాటు… దేశంలోని ఇతర సైనికులకు సాయం చేయడాన్ని అభినందించారన్నారు మంత్రి. సంతోష్ బాబు తల్లిదండ్రుల గురించి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… కొడుకు పోయిన బాధ కంటే దేశం కోసం చనిపోయాడని వాళ్ళు చెప్పడం వారి గొప్పదానానికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం స్వయంగా సూర్యపేటలోని వాళ్ల నివాసానికి వస్తారని, ఆయన రాకపై వారి కుటుంబానికి సమాచారమిచ్చామన్నారు.
కాగా సోమవారం సీఎం కేసీఆర్ సూర్యాపేటకు రానున్నారు . కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.