Gautam Gambhir: టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతుంది. గత ఏడాది కోహ్లీ, రోహిత్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకడంతో పాటు 2027 ప్రపంచకప్కు ముందు వారి వన్డే భవిష్యత్తుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో శుభ్మన్ గిల్ను వన్డే జట్టు కెప్టెన్గా నియమించడం కూడా ఈ చర్చలకు మరింత ఊతమిచ్చింది. ఈ విషయంపై తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఎదురైనా ప్రశ్నకు గంభీర్ స్పందిస్తూ.. డ్రెస్సింగ్రూమ్లో అందరితో నిజాయితీగా వ్యవహరిస్తాను.. తాను కూడా ఒక మనిషినే కాబట్టి తప్పులు జరిగే అవకాశం ఉందని ఒప్పుకున్నారు.
డ్రెస్సింగ్రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరితో తాను నిజాయితీగా ఉంటానని.. అందుకే వారందరితో కళ్లలోకి చూసి మాట్లాడగలుగుతున్నానని హెడ్ కోచ్ గంభీర్ తెలిపారు. సోషల్ మీడియాలో నేను కోహ్లీ, రోహిత్లకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి కామెంట్ కి సమాధానం ఇవ్వడం నా పని కాదని స్పష్టం చేశారు. నెట్టింట జరిగే వచ్చే ప్రతి విషయాన్ని నేను స్పష్టీకరించాల్సిన అవసరం లేదన్నారు. వాటికి సమాధానం ఇవ్వడం కంటే, చాలా పెద్దది నా పని అన్నారు. భారత జట్టు నా ఒక్కడిదే కాదు.. అది డ్రెస్సింగ్రూమ్లో ఉన్న వాళ్లతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరిది అన్నారు. ఇండియన్ టీమ్ దేశాన్ని గర్వపడేలా చేయడానికి ఆటగాళ్లు ప్రయత్నిస్తారని, కేవలం టీఆర్పీలు లేదా క్లిక్స్ కోసం జట్టును విమర్శించడం సరికాదు.. వార్తలను బాధ్యతగా ప్రచారం చేయాలని మీడియాకు గౌతమ్ సూచించారు.
ALSO READ : నమన్ అవార్డ్స్లో బీసీసీఐ బ్లండర్ మిస్టేక్స్..
ఇక భారత జట్టు ఇప్పుడు వచ్చే 2027 క్రికెట్ ప్రపంచకప్పై దృష్టి పెట్టింది అని కోచ్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇతర ఫార్మాట్ల నుంచి రిటైర్ అయినప్పటికీ వన్డే జట్టులో కీలక పాత్ర పోషించనున్నారు. అందువల్ల కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ స్టార్ ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. దీంతో కోహ్లీ, రోహిత్తో విభేదాలు ఉన్నాయనే ప్రచారాన్ని గంభీర్ పరోక్షంగా ఖండిస్తూ, భారత జట్టులో ఐక్యతే ముఖ్యమని స్పష్టం చేశారు.
