మేడారం జాతర సందర్భంగా ఆదివారం (జనవరి 18) అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం రేవంత్.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భావోద్వేగానికి గురయ్యారు. నాకు మరణం అంటూ వస్తే .. నేను నిర్మించిన సమ్మక్క-సారలమ్మ ఆలయం గుర్తొస్తుందని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మేడారం అభివృద్ధి పనులతో తన జన్మ ధన్యమైందని అన్నారు.
మేడారం అభివృద్ధిలో భాగంగా తిరుపతి, కుంభమేళా స్థాయిలో నిత్యం వసతి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు సీఎం. జంపన్నవాగును మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. జంపన్నవాగులో శాశ్వతంగా నీరు ఉండేలా చూస్తామన్నారు. సమ్మక్క సారలమ్మ చెంతన మంత్రి వర్గ సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
వీరత్వమే దైవత్వంగా మారిన ప్రదేశం మేడారం అని.. కాకతీయులపై కత్తి దూసిన వీరవనితలు సమ్మక్క-సారలమ్మ అని కొనియాడారు. హాత్ సే హాత్ జోడోయాత్ర ఇక్కడ నుంచే ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క సారలమ్మను దక్షిణాది కుంభమేళాగా తీర్చి దిద్దామని అన్నారు. మంత్రులు సీతక్క, సురేఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులు జరిగాయని చెప్పారు.
