పటాన్ చెరు ఘటనపై సీఎం రేవంత్ ఆరా..కాసేపట్లో ఘటనా స్థలానికి మంత్రి వివేక్

పటాన్ చెరు ఘటనపై  సీఎం  రేవంత్ ఆరా..కాసేపట్లో ఘటనా స్థలానికి మంత్రి వివేక్

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు కెమికల్ ఫ్యాక్టరీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన రేవంత్.. బిల్డింగులో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరో వైపు ఘటనా స్థలం దగ్గర జరుగుతోన్న రెస్క్యూ ఆపరేషన్ ను  మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు. కాసేపట్లో కార్మిక శాఖమంత్రి వివేక్ వెంకటస్వామి ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు సజీవ దహనం అయ్యారు. పదుల సంఖ్యలో గాయాలయ్యాయి.

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ సెజ్ లోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో జూన్ 30న ఉదయం రియాక్టర్ పేలి భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఇది అతి పెద్ద ప్రమాదంగా మారింది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఆరుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రియాక్టర్ పేలుడుకు ఆ ప్రాంతం అంతా కుప్పకూలింది. శిథిలాల కింద చాలా మంది కార్మికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే సహాయ చర్యలు వేగవంతం చేశారు. పదుల సంఖ్యలో ఫైరింజన్లు స్పాట్ కు చేరుకున్నాయి. 

రియాక్టర్ పేలుడుకు కంపెనీకి చెందిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఈ బిల్డింగ్ లో చాలా మంది కార్మికులు పని చేస్తున్నారని.. కేవలం ఆరుగురు మాత్రమే బయటకు వచ్చారని చెబుతున్నారు మిగతా సిబ్బంది. శిథిలాల కింద చాలా మంది కార్మికులు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే శిథిలాల తొలగింపును వేగంగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ పేలుడులో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. 20 మంది కార్మికులు చందానగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో.. 18 మంది ఇస్నాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.