
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి వాడుతున్న భాష మహిళలను అవమానించేలా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా ఆయన మాట్లాడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. ఇకనైనా తన భాష మార్చుకోవాలని, తను వాడే పదాల విషయంలో జాగ్రత్త వహించాలని ఆమె సూచించారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడమే రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇది ఆయన స్థాయికి తగదన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలను కించపర్చడమేనా అని ప్రశ్నించారు.
రైతులకు ఇచ్చిన హామీలపై రేవంత్ మాట్లాడాలని, కౌలు రైతులను ఏట్లా గుర్తిస్తారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం స్కీమ్ను ఎప్పట్నుంచి అమలు చేస్తరో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇబ్బంది కలగకుండా సరిపడా బస్సులు తిప్పాలన్నారు. రేవంత్ రెడ్డి సీటును టచ్ చేసే వాళ్లు ఆయనే పక్కనే ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు.