ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ గూడుపుఠానీ: సీఎం రేవంత్

ఎంపీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ బీజేపీ గూడుపుఠానీ: సీఎం రేవంత్

 

పాలమూరు ఉమ్మడి జిల్లాకు లేక లేక మంచి అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ, ఎలాగైనా నష్టం చేయాలన్న ఉద్దేశంతో దొంగ దెబ్బ తీసేందుకు దొంగలంతా ఏకమయ్యారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై గూడుపుఠానీ చేస్తున్నాయన్నారు. వంశీచంద్ రెడ్డి మీదనో, మల్లు రవి మీదనో వారి కోపం కాదని.. రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టాలన్నదే వారి ఆలోచన అని అన్నారు. ‘‘సొంత జిల్లాల్లో రాజకీయంగా బలహీనం చేయాలని చూస్తున్నారు. దాన్ని చూసి రాష్ట్రమంతా తిట్టుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టొచ్చన్న దుష్ట ఆలోచనలకు తెరతీస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో కూడా గెలిచేవాళ్లం. కానీ, డీకే అరుణ వచ్చి వాళ్ల అల్లుడికి ఓట్లు వేయించింది. ఓట్లకు ముందు రోజు వరకు మామా అల్లుళ్లకు గొడవలు అన్నట్టుగా ప్రచారం చేశారు. పోలింగ్ రోజు మాత్రం ఓట్లన్నీ అల్లుడికి వేయించింది.

లేదంటే కాంగ్రెస్ గద్వాలలో ఈజీగా గెలిచేది. ఇప్పుడు కూడా మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్ లోక్​సభ సెగ్మెంట్​లలో అదే గూడుపుఠానీకి తెరతీశారు. నన్ను మహబూబ్​నగర్​లో దెబ్బ తీస్తే రాష్ట్రమంతా ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టవుతుందని.. నా మీద కుట్రలు చేస్తున్నారని తెలిసింది. ఆ పార్టీలోనూ ఉండే నా అభిమానులే ఈ విషయాలు నాకు చెప్పారు’’ అని సీఎం వెల్లడించారు. ‘‘ఐదేండ్ల నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ జిల్లా కోసం ఏం చేశారు? ఆర్డీఎస్ కాల్వలు తవ్వించి కర్నాటక నుంచి నీళ్లేమైనా తెప్పించారా? తుమ్మిళ్ల ప్రాజెక్టు కోసం కొట్లాడారా? మహబూబ్​నగర్ జిల్లాకు మోదీ నుంచి రూ.10 వేల కోట్లు ఏమైనా ఇప్పించారా? పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించారా? ఇవేవీ చేయని ఆమె.. తనకు మాత్రం పార్టీ పదవి తెచ్చుకున్నారు’’ అని రేవంత్ విమర్శించారు.