
- తొలుత అగ్రికల్చర్, వెటర్నరీ వర్సిటీలు, కాలేజీలు, దేవాలయ భూముల్లో..
- కమిటీ ఏర్పాటు చేసి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అత్యాధునిక సౌలతులతో గోశాలలను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని, గడువులోగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గోశాలల నిర్మాణం, నిర్వహణ కోసం బడ్జెట్ అంచనాలు రూపొందించాలన్నారు. గోశాలల ఏర్పాటు, నిర్వహణ, అభివృద్ధి తదితర అంశాలపై శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
గోవుల సంరక్షణ కోసం అత్యాధునిక సౌలతులతో గోశాలలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో అగ్రికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీలు, కాలేజీలు, దేవాలయ భూముల్లో నిర్మించాలని సూచించారు. అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని, కనీసం 50 ఎకరాల్లో గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘గోవులు బంధించినట్టుగా ఇరుకు స్థలాల్లో కాకుండా మేతకు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండాలి. గోశాలల నిర్వహణ, సంరక్షణ విషయంలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని కూడా పరిశీలించండి” అని సూచించారు.
ఈ సందర్భంగా తన సొంత జిల్లా వికారాబాద్లోని మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను సీఎం పరిశీలించి మార్పులు సూచించారు. మరో నాలుగైదు రోజుల్లో తుది మోడల్ ఖరారు చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో సీఎంవో అధికారులు శేషాద్రి, శ్రీనివాసరాజు, మాణిక్ రాజ్, అజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పశుపోషణ విభాగం డైరెక్టర్ బి.గోపి తదితరులు పాల్గొన్నారు.