
- ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: బీసీలకు లోకల్ బాడీ ఎన్నికలు, విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు ఆమోదం తెలిపేలా పార్ల మెంట్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు గురువారం పార్లమెంట్లో ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో కుల సర్వే, అసెంబ్లీలో బీసీ బిల్లుల ఆమోదం విషయాలను ఖర్గేకు, సీనియర్ నేత జైరాం రమేశ్కు సీఎం రేవంత్రెడ్డి వివరించారు.
బిల్లులను ఆమోదించాలని కోరుతూ రాష్ట్రపతి అపాయింట్మెంట్కు ప్రయ త్నిస్తున్నామని తెలిపారు. బిల్లుల ఆమోదం కోరు తూ తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్ పర్సన్లు, బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో జంతర్ మంతర్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించామని ఖర్గేకు సీఎం రేవంత్ తెలిపారు. ఈ ఆందోళనకు ఇండియా కూటమిలోని వివిధ పార్టీల ఎంపీలు హాజరై సంఘీభావం తెలిపారని గుర్తుచేశారు.
సమావేశంలో డిప్యూటీ సీంఎ భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.