ఎప్రిల్ 20న మెదక్ కు సీఎం రేవంత్​రెడ్డి రాక

ఎప్రిల్ 20న మెదక్ కు సీఎం రేవంత్​రెడ్డి రాక

మెదక్, వెలుగు : మెదక్ లోక్​ సభ కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి నీలం మధు ఈనెల 20న నామినేషన్​ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా మెదక్​ పట్టణంలో భారీ ఎత్తున నిర్వహించనున్న కాంగ్రెస్​ పార్టీ ర్యాలీకి సీఎం రేవంత్​ రెడ్డి హాజరుకానున్నట్టు దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి, మెదక్ లోక్​ సభ ఎన్నికల ఇన్​చార్జి కొండ సురేఖ వెల్లడించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ శివారు శామీర్ పేటలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,  మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్,  మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల డీసీసీ ప్రెసిడెంట్లు, ​ఆయా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​చార్జిలు, బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతో మంత్రి సురేఖ భేటీ అయ్యారు.

 ఈ సందర్భంగా ఈనెల 20న ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్  సందర్భంగా నిర్వహించే ర్యాలీ, జనసమీరణ గురించి చర్చించి, సక్సెస్​ చేయడంపై దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నుందున లోక్​ సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయాలని సూచించారు. నియోజకవర్గస్థాయి కమిటీలతోపాటు మండల కమిటీలు వేసుకొని ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లాలన్నారు.