
- వ్యవసాయ, పోలీస్ అధికారులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి నిఘా పెట్టండి
- రైతులకు ఎరువులు, విత్తనాలకుఇబ్బందుల్లేకుండా చూడండి
- వ్యవసాయ శాఖ సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేసే కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పారు. శుక్రవారం సెక్రటేరియెట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వానాకాలం పంటల సాగుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలం పంటల సాగుకు సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు.
అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ‘‘నకిలీ విత్తనాల దందాను అరికట్టేందుకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లాల వారీగా వ్యవసాయ, పోలీస్ అధికారులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి దాడులు నిర్వహించాలి. రాష్ట్ర సరిహద్దుల్లో అన్ని చోట్ల టాస్క్ఫోర్స్ నిఘా ఉంచాలి” అని సూచించారు. ‘‘ఎవరెవరు కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నారు? ఎక్కడ నిల్వలు ఉన్నాయి. ఎక్కడి నుంచి రవాణా అవుతున్నాయనే సమాచారం అధికారులకు ఉంది.
ఎవరినీ ఉపేక్షించకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. నకిలీ దందా చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలి” అని ఆదేశించారు. విత్తనాలు, ఎరువులకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మాట్లాడాలని సీఎస్ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.
రైతులూ అప్రమత్తంగా ఉండాలి..
రైతులు నకిలీ విత్తనాల బారినపడకుండా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు సరిపడా అందుబాటులో ఉంచుతామని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ఈసారి రుతుపవనాలు ముందే వస్తుండటంతో రాష్ట్రంలోనూ వానలు ముందుగానే కురిసే అవకాశముంది. అందుకు అనుకూలంగా సరైన సమయంలో రైతులు పంటలు వేసుకోవాలి. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు. ఈ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్యాకేజ్డ్ విత్తనాలు తప్ప.. లూజ్ విత్తనాలు కొనుగోలు చేయవద్దు.
విత్తన ప్యాకెట్లు కొనేటప్పుడు తప్పకుండా బిల్లును, ప్యాకెట్ను పంట కాలం ముగిసేంత వరకు భద్రపరుచుకోవాలి” అని సూచించారు. కాగా, ఇప్పటికే అన్ని జిల్లాల్లో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు. ఈ సీజన్లో వరి, పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని.. రైతుల నుంచి డిమాండ్ ఉన్న అన్ని కంపెనీల విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని చెప్పారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.