- రాష్ట్ర ప్రణాళికా సంఘంవైస్ చైర్మన్ చిన్నారెడ్డి నేతృత్వం
- సభ్యులుగా ప్రొఫెసర్ కోదండరాం, ఐఏఎస్ ఆఫీసర్ దివ్య
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాలని సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి నేతృత్వంలో ప్రొఫెసర్ కోదండరాం, ఐఏఎస్ అధికారి దివ్య సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 10న రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ లో ని ఎంసీహెచ్ఆర్డీలో సమావేశమైన విషయం తెలిసిందే.
సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వీటిని పరిశీలించి సాధ్యాసాధ్యాలు, పరిష్కార మార్గాలను సూచించే బాధ్యతను త్రిసభ్య కమిటీకి అప్పగించారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పరిష్కరించే దిశగా సలహాలు, సూచనలతో నివేదికను అందజేయాలని కమిటీకి సూచించారు.