కొత్త టెక్నాలజీతో కంటైనర్, మొబైల్ అంగన్వాడీలు:సీఎం రేవంత్రెడ్డి

కొత్త టెక్నాలజీతో కంటైనర్, మొబైల్ అంగన్వాడీలు:సీఎం రేవంత్రెడ్డి
  • దేశానికి రోల్‌మోడ‌ల్‌గా అంగ‌న్‌వాడీలు
  • పౌష్టికాహారం, టీచింగ్​లో అగ్రగామిగా ఉండేలా కార్యాచరణ: సీఎం రేవంత్​
  • కొత్త టెక్నాలజీతో కంటైనర్, మొబైల్ అంగన్​వాడీలు
  • త‌‌ల్లిదండ్రుల‌‌కు భరోసా కల్పించేలా ఉద్యోగుల వేత‌‌నాల నుంచి వాటా!
  • 10–15 శాతం కట్ చేసేలా పరిశీలించాలి
  • ర‌‌వాణా, దేవాదాయ‌‌, ఐటీ స‌‌హా వివిధ శాఖ‌‌ల్లో ట్రాన్స్‌‌జెండ‌‌ర్ల సేవ‌‌లు.. 
  • దివ్యాంగుల‌‌కు అండ‌‌గా ప్రభుత్వం సంక్షేమ శాఖ‌‌లపై సీఎం స‌‌మీక్ష

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని అంగన్‌‌వాడీ కేంద్రాలను దేశంలోనే రోల్‌‌మోడ‌‌ల్‌‌గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్‌‌వాడీలకు వచ్చే పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు, ఐదేళ్ల వయసు వరకు వారికి పూర్వ ప్రాథమిక విద్యను అందించి, నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడాలని సీఎం సూచించారు. ఉద్యోగాలు చేస్తున్న పలువురు తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, అటువంటి వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

సోమవారం జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌‌జెండర్ల సాధికారిత శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల వేతనాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాలకు 10-–15 శాతం జమ అయ్యే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. అస్సాంలో ఇప్పటికే అటువంటి పథకం అమలవుతోందని, ఇతర రాష్ట్రాల్లో ఇంకా అటువంటివి ఏవైనా ఉంటే పరిశీలించి ఒక రిపోర్టు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. 

అంగన్‌‌వాడీలకు నూతన భవనాలు నిర్మించే విషయంలో ఆధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని సీఎం పేర్కొన్నారు. పిల్లల అవసరాలకు తగినట్లు కంటైనర్లతో డిజైన్ చేయించే అంశాన్ని స్టడీ చేయించాలన్నారు. సోలార్ ప్లేట్లు, బ్యాటరీ బ్యాకప్‌‌తో కంటైనర్ అంగన్‌‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే తక్కువ వ్యయం, ఎక్కువ సౌకర్యం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.

 ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని మురికివాడలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్ అంగన్‌‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విశ్రాంత ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఆయా పిల్లలకు బోధన చేసేందుకు ఆసక్తి చూపితే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలంగాణ ఫుడ్స్, విజయ డెయిరీ ఉత్పత్తులను అంగన్‌‌వాడీలకు అందేలా చూడాలని సీఎం అన్నారు.

అనాథలకు చేయూత.. 

అనాథ పిల్లలకు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశం కల్పిస్తున్నారని, అదే సమయంలో ఏటీసీల్లోనూ వారికి ప్రవేశాలు కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సింగపూర్‌‌లోని నైపుణ్య శిక్షణ కేంద్రాలకు పంపే ఒప్పందం చేసుకున్నామని, అక్కడికి పంపేవారిలో అనాథ పిల్లలకు చోటు కల్పించాలని సీఎం ఆదేశించారు. ట్రాన్స్‌‌జెండర్లకు ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అవకాశం కల్పించామని, వారి సేవలను రవాణా, దేవాదాయ శాఖ, వైద్యారోగ్య శాఖలతో పాటు ఐటీ, ఇతర కంపెనీల సేవల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు.

తెలంగాణ రైజింగ్‌‌-2047లో సంక్షేమం

‘‘తెలంగాణ రైజింగ్‌‌-2047’’ డాక్యుమెంట్‌‌లో చిన్నారులు, మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై విధానాలు రూపొందించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. దివ్యాంగుల మధ్య వివాహాలు, వివిధ పథకాల్లో దివ్యాంగులకు ప్రోత్సాహకాలు కల్పించడంపై స్టడీ చేసి వచ్చే కేబినెట్ సమావేశం నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమీక్షలో మంత్రులు సీతక్క, పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి

అంగన్‌‌వాడీ కేంద్రాల్లోని ప్రతి పిల్లవానికి పౌష్టికాహారం అందించాలని, ఇందుకు స్వచ్ఛంద సంస్థల (ఎన్​జీవో) సేవలు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. బాలామృతం ప్లస్‌‌ను పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. కర్నాటకలో జొన్న రొట్టెలను వినియోగిస్తున్నారని, పౌష్టికాహార నిపుణులతో చర్చించి వాటిని మహిళా సంఘాలతో పిల్లలకు అందించే అంశంపైనా దృష్టిసారించాలని సీఎం తెలిపారు. అంగన్‌‌వాడీల్లో పౌష్టికాహారం అందజేత, అంగన్‌‌వాడీల పర్యవేక్షణ, నిర్వహణపై వంద రోజుల కార్యాచరణ రూపొందించి అమలు 
చేయాలని సూచించారు.