
- వర్షాకాల సన్నద్ధతపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
- కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించేలా వ్యవస్థ ఉండాలి
- నాలాల పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలని సూచన
- మీరాలం ట్యాంక్ బ్రిడ్జి నిర్మాణ డిజైన్లు పరిశీలన
హైదరాబాద్, వెలుగు: వర్షాలు, వరదల వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఇప్పటికే గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్లలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్న సీఎం, వర్షపు నీటిని ఆటోమేటిక్ పంపులతో బయటకు పంపే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముందస్తు చర్యలు చేపట్టాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వర్షాలు, వరదలను పర్యవేక్షించేందుకు ఒక వ్యవస్థను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరంలో వర్షాల సమయంలో ట్రాఫిక్, ఇతర సమస్యలు రాకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. నాలాల పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయాలని, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి కోర్ అర్బన్ రీజియన్లో సమస్యలు తలెత్తకుండా డీసిల్టింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణకు సంబంధించి ప్రత్యేక పాలసీ తయారీని పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
మూసీ పునరుజ్జీవం పైనా రివ్యూ
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. మీరాలం ట్యాంక్పై రెండున్నర కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జిని నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారు. దీంతో బాపూఘాట్లో నిర్మించతలపెట్టిన గాంధీ సరోవర్ తోపాటు మీరాలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను ఆయన పరిశీలించారు. మీరాలం ట్యాంక్పై బ్రిడ్జి నిర్మాణ పనులకు ఈ నెలలోనే టెండర్లు పిలవాలని సూచించారు. ఇప్పటికే చేసిన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్ వివరాలపై చర్చించారు. రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలని, అదే సమయంలో సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉండే డిజైన్లను ఎంచుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. బ్రిడ్జితో పాటు మీరాలం ట్యాంక్లో వివిధ చోట్ల ఐలాండ్స్ ఉన్న 3 ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని అన్నారు. సింగపూర్లోని ‘గార్డెన్స్ బై ది బే’ ను తలపించేలా బర్డ్స్ ప్యారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ 3 ఐలాండ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. వెడ్డింగ్ డెస్టినేషన్ కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతోపాటు అడ్వెంచర్ పార్క్, థీమ్ పార్క్, యాంఫీ థియేటర్ను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లు ఉండాలన్నారు. పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలన్నారు. మూసీ పునరుజ్జీవంలో మొదటి దశలో నార్సింగి నుంచి బాపూఘాట్ వరకు 21 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాంతంలో గోల్కొండ, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల పరిధిలో రక్షణ శాఖకు చెందిన 900 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ ప్రక్రియను
వెంటనే పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.