
హైదరాబాద్, వెలుగు: జులై 13న సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించనున్న బోనాల మహోత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ అధికారులు ఆహ్వానించారు. సోమవారం సెక్రటేరియట్లో మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులు సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు.
అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించనున్న గోల్కొండ బోనాల ఉత్సవాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని శ్రీజగదాంబ మహంకాళి టెంపుల్ కమిటీ సభ్యులు సోమవారం మంత్రుల నివాస సముదాయంలో ఆయనను కలిసి ఆహ్వానం అందించారు.