
కాళేశ్వరం కమిషన్కు జవాబు చెప్పకుండా మాపై ఎదురు దాడి చేస్తున్నడు
కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
బంగారు తెలంగాణ పేరు చెప్పి బొందలగడ్డను చేసిండు
కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆయన బిడ్డనే చెప్పింది
అది భారత రాష్ట్ర సమితి కాదు.. దయ్యాల రాష్ట్ర సమితి
ఆ కొరివి దయ్యాలను తెలంగాణ పొలిమేర దాకా తరిమికొట్టాలి
ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం
- వాసాలమర్రి బాధితులకు ఇండ్లు కట్టిస్తామని హామీ
- -ఆలేరులో ‘ప్రజాపాలన–-ప్రగతిబాట’ బహిరంగ సభలో సీఎం ప్రసంగం
- గంధమల్ల రిజర్వాయర్ సహా వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
యాదాద్రి, వెలుగు:కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులిస్తే, పొయ్యి జవాబు చెప్పకుండా ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం కమిషన్ ఒక్క నోటీసు ఇస్తేనే ఆయన (కేసీఆర్) ఆగమాగమైతుండు. మరి నెలలకొద్దీ జైల్లో గడిపిన మేమేమనుకోవాలి. నువ్వేమైనా దేవుడివా? నువ్వూ మనిషివే కదా? సెషన్కోర్టు నోటీసు ఇస్తే.. జడ్జి ఎదురుగా ఆనాటి ప్రధాని పీవీ నర్సింహారావు చేతులు కట్టుకొని నిలబడ్డరు.
అలాంటిది వీళ్లకెందుకయ్యా (బీఆర్ఎస్ నేతలు) అంత బలుపు. వీళ్లు చేసిన తప్పులకు కమిషన్ నోటీసులు ఇచ్చింది. దానికి కాళేశ్వరం కమిషనా? కాంగ్రెస్ కమిషనా? అని మాపై ఎదురుదాడి చేస్తున్నరు. కమిషన్ఎదుట జవాబు చెప్పకుండా మా మీద ఎదురుదాడి చేసుడేంది?” అని ఫైర్ అయ్యారు. శుక్రవారం యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో గంధమల్ల రిజర్వాయర్, మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ సహా రూ.1,051.45 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
తుర్కపల్లి మండలం తిర్మలాపూర్లో నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతి బాట’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పదేండ్లలో బంగారు తెలంగాణను బొందలగడ్డగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ.. ఆ దయ్యాలను బయటపెట్టాలన్నారు.
‘‘సొంత బిడ్డనే పార్టీలో దయ్యాలు ఉన్నాయంటే కూడా మాట్లాడలేని పరిస్థితిలో దయ్యాల నాయకుడు (కేసీఆర్) ఫామ్హౌస్లో నిద్రపోతున్నడు. ఇక నుంచి ఆ పార్టీ బీఆర్ఎస్ కాదు.. డీఆర్ఎస్. డీఆర్ఎస్ అంటే దయ్యాల రాష్ట్ర సమితి. అవి దయ్యాలు కావు.. కొరివి దయ్యాలు. వాటిని తెలంగాణ పొలిమేర వరకు తరిమికొట్టాలి” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వాళ్లు ఎక్కడ కనిపించినా దయ్యాల పార్టీ వాళ్లు అని పిలవాలని సూచించారు.
ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో నాపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారు. బెయిల్ మీద జైలు నుంచి బయటికొచ్చిన రోజే.. కేసీఆర్ని పడగొడతానని చెప్పిన. ఆ మాట ప్రకారం పట్టుబట్టి, పడగొట్టి ఆయన కుర్చీలోనే కుర్చున్నా. నా లక్ష్యం కేసీఆర్ను గద్దె దించడమే.. అది పూర్తయింది” అని అన్నారు. అలాగే ఇప్పుడు ఎవరు అడ్డుపడ్డా తొక్కుకుంటా వెళ్లి మూసీ ప్రక్షాళన చేస్తానని పేర్కొన్నారు.
‘‘ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి సబర్మతి, గంగ, యయునా నదులను ప్రక్షాళన చేస్తే తప్పు లేనప్పుడు.. మూసీ ప్రక్షాళనకు బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు అడ్డుపడ్తున్నాయి. ఆ రెండు పార్టీలు మూసీ వెంట నివసిస్తున్న పేదలను రెచ్చగొడ్తున్నాయి. మూసీ వెంట ఉన్నోళ్లందరూ మన ప్రజలే. వారికి వెయ్యి ఎకరాలు కేటాయించి ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పినా స్వాగతించడం లేదు. నేనేమైనా ఎర్రవల్లి, జన్వాడ పామ్హౌస్లో జెండా పాతుతున్నానా?’’ అని ప్రశ్నించారు.
వన్ట్రిలియన్ఎకానమీ స్టేట్గా మారుస్త..
ప్రజలు సహకరిస్తే తెలంగాణను పదేండ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జపాన్, సింగపూర్ సరసన తెలంగాణను నిలుపుతానని చెప్పారు.
‘‘దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన చేపట్టాం. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. వాళ్లను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వివిధ వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నాం. 600 బస్సులను మహిళా సంఘాలకు ఇచ్చాం. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, పాఠశాల యూనిఫామ్ కుట్టే బాధ్యతలనూ అప్పగించాం. పేదలకు 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే జీతాలు ఇస్తున్నాం. ఒక్క ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్స్కూళ్లు నిర్మిస్తున్నాం” అని పేర్కొన్నారు.
చేసిన పాపాలు వెంటాడ్తయ్..
చేసిన పాపాలు ఎక్కడికీ పోవని, నీడలెక్క వెంటే వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘యాదగిరిగుట్ట మీద కాంట్రాక్టులు ఇచ్చి ఎవరు మెక్కిండ్రో అందరికీ తెలుసు. ఆరోపణలు చేసి దేవుడిని వివాదాలు, రాజకీల్లోకి లాగదలుచుకోలేదు. కానీ యాదగిరిగుట్ట మీద జరిగిన అపచారం ఊరికేపోలేదు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన రోజే బొక్క బోర్లా పడి మక్కెలు ఇరగ్గొట్టుకున్నారు. పాపాలు చేసినందుకే మీ పరిస్థితి అట్లయింది” అని కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు.
వాసాలమర్రిలో ఇండ్లు కట్టిస్తం..
యాదగిరిగుట్ట నారసింహుడి ఆశీస్సులతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. భక్తుల ఆకాంక్ష మేరకు యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చామన్నారు. ‘‘టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్కు వైటీడీ (యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్) బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతిలో ఉన్న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాదిరిగానే.. ఇక్కడ ఏర్పాటు చేసే ప్రభుత్వ వైద్య కళాశాలను యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తాం” అని చెప్పారు.
‘‘వాసాలమర్రిలో నాటి సీఎం ఇండ్లు కూలగొట్టించి శ్మశానంలా మార్చిండు. ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్కు వెళ్లడానికి గ్రామం మీదుగా రోడ్డు వేసుకున్నాడు. ఇప్పుడు ఆ కూలిన ఇండ్ల లెక్క తీయమని ఇక్కడి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ కిరణ్కుమార్కు చెప్తున్నా.. ఆ ఇండ్లను తప్పకుండా కాంగ్రెస్సర్కారు నిర్మించి ఇస్తుంది’’ అని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంటే, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి: చామల
ప్రజలు గెలిపించిన కాంగ్రెస్పై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దాన్ని ప్రజలే తిప్పికొట్టాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘‘రూ.21 వేల కోట్ల రైతు రుణాలను ఏక కాలంలో మాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కింది. సీఎంగా రేవంత్ రెడ్డికి, కేసీఆర్కు చాలా వ్యత్యాసం ఉంది. మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేస్తే.. ఆ అప్పులకు అసలు, మిత్తీ కట్టుకుంటూ రాష్ట్రాన్ని గట్టుకు చేర్చడం కోసం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు” అని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో నాపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారు. బెయిల్ మీద జైలు నుంచి బయటికొచ్చిన రోజే.. కేసీఆర్ని పడగొడతానని చెప్పిన. ఆ మాట ప్రకారం పట్టుబట్టి, పడగొట్టి ఆయన కుర్చీలోనే కూర్చున్నా. నా లక్ష్యం కేసీఆర్ను గద్దె దించడమే.. అది పూర్తయింది.
యాదగిరిగుట్ట మీద కాంట్రాక్టులు ఇచ్చి ఎవరు మెక్కిండ్రో అందరికీ తెలుసు. దేవుడిని వివాదాలు, రాజకీయాల్లోకి లాగదలుచుకోలేదు. కానీ యాదగిరిగుట్ట మీద జరిగిన అపచారం ఊరికేపోలేదు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన రోజే బొక్క బోర్లా పడి మక్కెలు ఇరగ్గొట్టుకున్నారు. పాపాలు చేసినందుకే మీ పరిస్థితి అట్లయింది.
ఎవరు అడ్డొచ్చినా గంధమల్ల పూర్తి చేస్తం..
ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో చైతన్యంగా పోరాడారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి జిల్లాను గత బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ‘‘గత ప్రభుత్వం పదేండ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. ఎస్ఎల్బీసీకి, డిండికి నిధులు ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడున్న ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ఎందుకు పూర్తి చేయలేదు? గంధమల్లను ఎందుకు పట్టించుకోలేదు? మేము గంధమల్లను నిర్మిస్తామంటే.. నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారని హరీశ్రావు అంటున్నారు. ఎన్నో ప్రాజెక్టులు కట్టిన మాకు నీళ్లు ఎట్లివ్వాలో తెల్వదా?” అని ప్రశ్నించారు. ఎవరు అడ్డొచ్చినా గంధమల్ల ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని చెప్పారు.
ఒక్క ఇల్లు కూడా కూల్చం: ఉత్తమ్
ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా గంధమల్ల రిజర్వాయర్నిర్మిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా భూసేకరణ చేపడతామని అన్నారు. ‘‘ఆలేరు నియోజకవర్గంలో సాగు నీటి కష్టాలను తీర్చేందుకు గంధమల్ల రిజర్వాయర్ కడుతుంటే.. ఎలా కడతారు? ఎట్ల నీళ్లు తెస్తారు? అని హరీశ్ రావు ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు అడ్డంపడ్డా గంధమల్ల రిజర్వాయర్ను అడ్డుకోలేరు” అని అన్నారు. సాధ్యమైనంత త్వరగా రిజర్వాయర్ పూర్తి చేసి ఆలేరు రైతుల చిరకాల కాంక్షను నెరవేర్చుతామన్నారు.
మరో ఐదేండ్లు మేమే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాష్ట్రంలో మరో ఐదేండ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అసమర్థ పాలన కారణంగా పదేండ్ల పాటు అభివృద్ధికి నోచుకోని ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఆలయ అభివృద్ధి పేరుతో యాదగిరిగుట్టను కేసీఆర్ ఆగం చేశారని మండిపడ్డారు.