నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు : రేవంత్ రెడ్డి

నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు : రేవంత్ రెడ్డి
  • నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు
  • ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు.. పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం 
  • పోలీస్ శాఖలో హోంగార్డులు సహా ఇతర ఉద్యోగాలు భర్తీ చేయండి 
  • ఇప్పటివరకు చేపట్టిన నియామకాలపై రిపోర్టు ఇవ్వండి 
  • రాష్ట్రం కోసం రిజైన్​ చేసిన మాజీ డీఎస్పీ నళినికి అదే పోస్టు ఇవ్వండి 
  • ఊరూరా ప్రజావాణి నిర్వహించండి ప్రతినెల సభలు పెట్టాలని ఆదేశాలు   

హైదరాబాద్, వెలుగు : తన కాన్వాయ్ వెళ్లే టైమ్​లో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తాను ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ను ఆపొద్దని, ఇందుకోసం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. తాను ఇప్పటికే తన కాన్వాయ్ లోని 15 వాహనాలను 9కి తగ్గించానని పేర్కొన్నారు. ‘‘నేను ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇంట్లో కూర్చోలేను. ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు విస్తృతంగా పర్యటనలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నా కాన్వాయ్ వెళ్లే టైమ్​లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోండి” అని సూచించారు.

శుక్రవారం సెక్రటేరియెట్​లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్, వైద్యారోగ్య శాఖల్లో నియామకాలపై చర్చించారు. పోలీస్ శాఖలో వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా రిక్రూట్ మెంట్ జరగాలన్నారు. నియామకాల ప్రక్రియలో ఉన్న లోటుపాట్లు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్టు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపైనా నివేదిక ఇవ్వాలని కోరారు. ‘‘పోలీస్ శాఖలో గత ఏడెనిమిదేండ్లుగా హోంగార్డుల నియామకాలు లేవు. వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టండి. హోంగార్డుల ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా తగు చర్యలు తీసుకోండి. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణకు హోంగార్డుల సేవలను మరింత విస్తృత స్థాయిలో వినియోగించుకోండి” అని సూచించారు. 

పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు  రెసిడెన్షియల్ స్కూల్..  

పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. ‘‘పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి కండక్టర్ వరకు.. ఆ రెండు శాఖల్లోని ఉద్యోగుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించండి. అది కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఉండాలి. ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి” అని ఆదేశించారు. సమావేశంలో  వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్​ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస రావు, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, సీఎం సెక్రటరీలు శేషాద్రి, షా-నవాజ్ కాసీం, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, హైదరాబాద్ పోలీస్​కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. 

రేవంత్​ను కలిసిన ముస్లిం మత పెద్దలు.. 

సీఎం రేవంత్ రెడ్డిని పలువురు ముస్లిం మత పెద్ద లు కలిసి అభినందనలు తెలిపారు. శుక్రవారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేతృత్వంలో సెక్రటేరియెట్​కు వచ్చిన రేవంత్​ను సన్మానించారు. ఈ సందర్భంగా మైనారిటీల సంక్షేమమానికి చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. కాగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కొడుకు నిశ్చితార్థానికి రేవంత్ హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

ఇకపై ఊరూరా ప్రజావాణి..

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. ఇకపై పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతి నెల మొదటి వారంలో ఒకట్రెండు రోజులు సభలు నిర్వహించి.. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇలా చేస్తే జనం హైదరాబాద్ దాకా వచ్చే అవసరం ఉండదన్నారు. ‘‘ప్రజాభవన్​లో నిర్వహిస్తున్న ప్రజావాణికి, సెక్రటేరియెట్​కు రోజూ వందలాది మంది సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి. నిర్దేశిత సమయంలోగా సమస్యలన్నీ పరిష్కరించాలి. జనం నుంచి వస్తున్న ఫిర్యాదులను డిజిటలైజ్ చేయాలి. ఎప్పటికప్పుడు స్టేటస్ ను ప్రజలకు తెలియజేయాలి” అని ఆదేశించారు. ప్రజావాణికి అద్భుతమైన స్పందన వస్తున్నదని, ప్రజాభవన్ లో ఫిర్యాదుల స్వీకరణకు టేబుల్స్ పెంచాలని సూచించారు. అక్కడికి వచ్చే ప్రజలకు అవసరమైన సౌలతులు కల్పించాలన్నారు. ట్రైనీ ఐఏఎస్ ల సేవలు వినియోగించుకోవాలన్నారు. అలాగే సెక్రటేరియెట్ కు వస్తున్న ప్రజలు మంత్రులను కలిసేందుకు నిర్దిష్టమైన సమయం కల్పించాలన్నారు.

నళినికి న్యాయం చేద్దాం.. 

తెలంగాణ కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళినికి తిరిగి అదే ఉద్యోగం ఇవ్వడానికి ఇబ్బందేమిటని అధికా రులను సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఒకవేళ పోలీస్ శాఖలోకి తీసుకోవడం సాధ్యం కాకపోతే, అదే హోదాలో ఇతర శాఖలో జాబ్​ఇవ్వాలని సూచించారు. ‘‘ఉద్యోగా లకు రిజైన్ చేసి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపో యిన చాలామంది తిరిగి ఉద్యోగాల్లో చేరారు. అలాంటిది తెలంగాణ కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసిన నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడానికి అభ్యంతరాలు ఎందుకు? రిజైన్​ చేసి న నేతలకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలి. ఉద్యోగంలో చేరడానికి ఆమె రెడీగా ఉంటే, వెంటనే సర్వీసులోకి తీసుకోండి” అని సీఎం ఆదేశించారు.