హైదరాబాద్, వెలుగు: ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ ఉద్యోగులు కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ అంజయ్య ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. వేసవి డిమాండ్ దృష్ట్యా రాష్ట్ర రైతాంగానికి, అన్ని వర్గాలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. సమన్వయంతో పని చేసి బెటర్ సర్వీసు అందించాలన్నారు. ఈ సందర్భంగా టీఏఓఏ జనరల్ సెక్రటరీ అంజయ్య మాట్లాడుతూ.. సీఎం ప్రజల కోణంలోనే ఆలోచిస్తూ.. వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తున్నారని కొనియాడారు. ప్రజాపాలన అనేది మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తున్నారని పేర్కొన్నారు.