
- ఢిల్లీలో ఐలమ్మకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి
న్యూఢిల్లీ, వెలుగు: అణచివేత, దమనకాండపై ఎగరవేసిన ధిక్కార పతాక చాకలి ఐలమ్మ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ వీరత్వాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80 ఏండ్ల క్రితమే జంగ్ సైరన్ మోగించిన యోధురాలు ఐలమ్మ అని సీఎం అన్నారు. సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని పేర్కొన్నారు.