
పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ నూతన విద్యా విధానం సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానం పైన విద్యా వేత్తలు,నిపుణులు,యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు,ఎంఎల్సీ ల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. విద్యా విధానంలో సమూల మార్పులు,ప్రక్షాళన చేస్తామన్నారు. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలన్నారు. గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా,కాకతీయ యూనివర్సిటీ లు కీలక పాత్ర పోషించాయని చెప్పారు రేవంత్. ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదన్నారు.
ప్రతి సంవత్సరం లక్షా 10 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు . వారిలో 15 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. విద్యలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతుంది. విద్యాశాఖకు 21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతుంది . విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడంమే నా ధ్యేయం. అందుకు కావాల్సిన సలహాలు,సూచనలు ఇవ్వాలి. 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. దేశ విద్య విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలి. పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక బద్దంగా పనిచేయాలి. స్కూల్ ఎడ్యుకేషన్ లో లోపాలు ఉన్నాయి. 11 వేల ప్రైవేట్ స్కూల్స్ లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరాను. 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు రావాలి. విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా సిద్దమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.