శంషాబాద్–చెన్నై బుల్లెట్ ట్రైన్.. ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్..!

శంషాబాద్–చెన్నై బుల్లెట్ ట్రైన్.. ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్..!
  • =  తెలంగాణకు రీజినల్ రింగ్ రైల్ ముఖ్యం
  • =  గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా ఫ్యూచర్  సిటీ నుంచి రైల్వే లైన్
  • = భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రెడీ చేయాలె
  • = పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: శంషాబాద్ నుంచి చెన్నయ్ వరకు బుల్లెట్ ట్రైన్ కొత్త రైల్వే కనెక్టివిటీ అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్‎తో పోలిస్తే కొత్త లైన్‎తో దూరం కూడా తగ్గుతుందని చెప్పారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. 

కొత్తగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల  గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, అందుకు సంబంధించి 300 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానం చేస్తూ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని అన్నారు. 

రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందన్నారు.  వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్  పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో  ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. 

హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతను ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. దాదాపు 362 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైలు ఏర్పాటు చేయటంతో హైదరాబాద్ మహా నగరం భవిష్యత్తు స్వరూపం మారిపోతుందన్నారు. 

వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులకు సీఎం సూచించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండేలా ఈ కనెక్టివిటీ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. వరంగల్‎లోనూ రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని సూచించారు.

కాజీపేట జంక్షన్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‎తో పాటు వరంగల్‎ను అభివృద్ధి చేయాలని, అందుకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని ముఖ్యమంత్రి రైల్వే అధికారులకు సూచించారు.

లైన్ల పూర్తికి సంపూర్ణ సహకారం

పెండింగ్‎లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఉండాలని దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 

సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రెటరీ వికాస్ రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.