గోదావరిఖని, వెలుగు: గోదావరి పుష్కరాలకు కొద్ది నెలల సమయం మాత్రమే ఉందని, రామగుండం ప్రాంతానికి రూ.150 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి కోరారు. శనివారం హైదరాబాద్లోని సెక్రెటేరియట్లో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో ఉమ్మడి కరీంనగర్జిల్లా అభివృద్ధిపై జరిగిన రివ్యూలో రాజ్ఠాకూర్ పలు అంశాలను ప్రస్తావించారు.
పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో ప్రధాన రైలు మార్గం ఉన్న రామగుండానికి ప్రజలు కుంభమేళా తరహాలో వస్తారని, ఏర్పాట్ల కోసం ఇప్పటికే రూ.150 కోట్లకు డీపీఆర్ ఇచ్చామని, త్వరగా నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఆఫీస్లో 30 ఏళ్ల క్రితం రెగ్యులర్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు 85 మంది ఉంటే ఇప్పుడు 37 మంది మాత్రమే ఉన్నారని, ఈ ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జనాభా ప్రాతిపదికన పబ్లిక్ హెల్త్ వర్కర్ల సంఖ్యను పెంచాలని కోరారు.
