కేసీఆర్ 22 కొత్త కార్లు దాస్కుండు : సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ 22 కొత్త కార్లు దాస్కుండు : సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయితే.. తాము అప్పుల కంటే ఆస్తులను సృష్టించి.. రాష్ట్రానికి అందించామని బీఆర్ఎస్ చెబుతోంది. ఈ రెండు పార్టీల మధ్య మరో కొత్త విషయం ప్రజలకు తెలిసింది. బీఆర్ఎస్ వాళ్లు ఆస్తులు కాదు.. అప్పులు చేసి వెళ్లారంటూ తనదైన స్టైల్లో చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూడోసారి ముఖ్యమంత్రి అవుతాననుకుని కేసీఆర్.. ముందుగానే 22 కొత్త ల్యాండ్ కూజర్ల వాహనాలు కొన్నారని చెప్పారు. ఇలాంటి వాటిని ప్రభుత్వ ఆస్తులు అంటారా..? అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 

సీఎం రేవంత్ ఏమన్నారంటే..? 

‘‘ కాన్వాయ్ కోసం నేను కొత్త బండ్లు కొనను.. ఖర్చు పెట్టను అని ముందుగానే అధికారులకు చెప్పాను. పాతబండ్లనే రిపేర్ చేసి, అడ్జెస్ట్ చేసి ఇవ్వండి అని అధికారులకు చెప్పాను. అయితే.. నేను సీఎం అయిన10 రోజుల తర్వాత ఒక విషయం తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు కొని దాచి పెట్టింది. ఈ విషయాన్ని ఓ అధికారి వచ్చి నాతో చెప్పాడు. కొత్త 22 ల్యాండ్ క్రూజర్లను విజయవాడలో దాచి పెట్టాం. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే మళ్లీ తీసుకొద్దామని అనుకున్నాం. కేసీఆర్ నెత్తిమీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయిండు’’ అని సదరు అధికారి తనతో చెప్పాడని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

అసలు ఇన్ని వందల వాహనాలు ఉన్నప్పుడు కొత్తవి అవసరమా..? అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక బండికి దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తే.. ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. ఇలాంటివి కేసీఆర్ సృష్టించిన సంపద అని చెప్పారు. 22 కొత్త ల్యాండ్ క్రూజర్ల వాహనాలు ప్రభుత్వ ఆస్తి.. తప్పనిసరిగా వాటిని తీసుకుంటామని స్పష్టం చేశారు.