కేసీఆర్ బేషరం మనిషి..ఆయనో ఎక్స్​పైరీ మెడిసిన్: రేవంత్

కేసీఆర్ బేషరం మనిషి..ఆయనో ఎక్స్​పైరీ మెడిసిన్: రేవంత్
  • అసెంబ్లీ సమవేశాలకు కేసీఆర్​ రాడేమో.. వస్తే మంచిది
  • గవర్నర్​ ప్రసంగానికీ రాలే.. ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా?
  • అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నడు
  • ఆయన అవినీతిపై ప్రొసీజర్​ ప్రకారమే విచారణ.. కేఆర్​ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించిందే కేసీఆర్
  • బీఏసీ మీటింగ్​కు కేసీఆర్​, కడియం వస్తారని చెప్పి హరీశ్​ వచ్చుడేంది?
  • రేపు హిమాన్షు కూడా వస్తనంటడేమో.. అనుమతిస్తరా?
  • అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెడ్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ బేషరం మనిషి అని, ఆయనో ఎక్స్​పైరీ మెడిసిన్​ అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. అధికారం కోల్పోవడాన్ని కేసీఆర్​ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి అసెంబ్లీలోని తన చాంబర్​లో మీడియాతో చిట్​చాట్​ చేశారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరుకావాల్సిన కేసీఆర్​ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ‘‘గవర్నర్​ ప్రసంగానికీ కేసీఆర్​ హాజరుకాలేదు. ఆయన దేనికీ రావడం లేదు. బీఏసీ మీటింగ్​కూ రాలేదు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్​ చిత్తశుద్ధి ఏందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​ వస్తరో రారోనన్న అనుమానం ఉంది. నేను మాత్రం రాడేమోనని అనుకుంటున్న. సభకు వచ్చి ప్రతిపక్ష నేతగా ఆయన తన బాధ్యతలను నెరవేర్చాలని కోరుకుంటున్న” అని సీఎం తెలిపారు.  

నిర్ణయం స్పీకర్​దే

బీఏసీ మీటింగ్​లో పాల్గొనేందుకు బీఆర్​ఎస్​ తరఫున కేసీఆర్, కడియం శ్రీహరి పేర్లను ఇచ్చారని, కేసీఆర్​ బదులు హరీశ్​రావు రావడమేమిటని సీఎం రేవంత్​ ప్రశ్నించారు. అయినా హరీశ్​రావును తామెందుకు మీటింగ్​లో అడ్డుకుంటామని, ఆయన్ను మీటింగ్​కు అనుమతించాలో లేదో నిర్ణయించాల్సింది స్పీకర్​ అని పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు హరీశ్​రావు లెక్కనే రేపు హిమాన్షు కూడా వస్తానంటడేమో... అనుమతిస్తరా” అని ఆయన అన్నారు. బీఆర్​ఎస్​ఎల్వోపీ ఆఫీసు  మార్పు స్పీకర్​ నిర్ణయమేనని చెప్పారు.

ప్రొసీజర్​ ప్రకారమే పోతం

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయంలో ఓ ప్రొసీజర్​ ప్రకారమే ముందుకు వెళ్తామని, కేసీఆర్​ అవినీతిపైనా ప్రొసీజర్​ ప్రకారమే చర్యలుంటాయని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ‘‘కసబ్​కు ఉరిశిక్షను కూడా ఓ పద్ధతి ప్రకారమే అమలు చేశారు. నేరుగా తీసుకొచ్చి కాల్చి చంపలేదు” అని ఆయన అన్నారు. కాళేశ్వరంపై సిట్టింగ్​ జడ్జితో విచారణ చేయించాలని తాము అనుకున్నామని, కానీ.. అది సాధ్యం కాదంటూ హైకోర్టు నుంచి తమకు లేఖ వచ్చిందని సీఎం చెప్పారు. విచారణకు రిటైర్డ్​ జడ్జిని ఇస్తామన్నారని, దీనిపై కేబినెట్​లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

అవసరమనుకుంటే సభను స్పీకర్​ పొడిగిస్తరు

అసెంబ్లీ సమావేశాలను పొడిగించాల్సిన అవ సరం ఉందనుకుంటే స్పీకర్​ నిర్ణయం తీసుకుని పొడిగించే చాన్స్​ ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. ముఖ్యమైన అంశాలపై చర్చించాలనుకుంటే సభను పొడిగించే అవకాశాలుంటాయని చెప్పారు. సభలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు. టీఎస్​పీఎస్సీ విషయంలోనూ పూర్తిగా ప్రొసీజర్​ను ఫాలో అవుతున్నామని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్​లో నిరుద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పటిష్ఠమైన చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ నాన్​ సీరియస్​ పొలిటీషియన్​ అని, అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రేవంత్​ అన్నా రు. ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను కొట్టిపారేశారు..

బేసిన్లు లేవ్​..భేషజాల్లేవ్​ అనుడేంది?

అధికారంలో ఉన్నప్పుడు నీళ్ల విషయంలో ‘బేసిన్లు లేవ్​.. భేషజాలు లేవు’ అని కేసీఆర్​ అనడం తెలంగాణపై ఆయనకున్న కమిట్​మెంట్​ ఏమిటో అర్థమవుతుందని సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించింది గత బీఆర్​ఎస్​ ప్రభుత్వమేనని చెప్పారు. నాగార్జునసాగర్​ను పోలీసులతో జగన్​ ఆక్రమించారని, అయినా గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్​ ఎందుకు పట్టించుకోలేదని ఆయన నిలదీశారు. రోజూ 12 టీఎంసీల నీళ్లను సాగర్​ నుంచి ఏపీ తీసుకెళ్తున్నా కేసీఆర్​ అడ్డుకోలేదన్నారు. కృష్ణా బేసిన్​లోని ప్రజలు బీఆర్​ఎస్​ను తిరస్కరించారని తెలిపారు.