
- అసెంబ్లీ సమవేశాలకు కేసీఆర్ రాడేమో.. వస్తే మంచిది
- గవర్నర్ ప్రసంగానికీ రాలే.. ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా?
- అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నడు
- ఆయన అవినీతిపై ప్రొసీజర్ ప్రకారమే విచారణ.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించిందే కేసీఆర్
- బీఏసీ మీటింగ్కు కేసీఆర్, కడియం వస్తారని చెప్పి హరీశ్ వచ్చుడేంది?
- రేపు హిమాన్షు కూడా వస్తనంటడేమో.. అనుమతిస్తరా?
- అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెడ్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ బేషరం మనిషి అని, ఆయనో ఎక్స్పైరీ మెడిసిన్ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అధికారం కోల్పోవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోని తన చాంబర్లో మీడియాతో చిట్చాట్ చేశారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరుకావాల్సిన కేసీఆర్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ‘‘గవర్నర్ ప్రసంగానికీ కేసీఆర్ హాజరుకాలేదు. ఆయన దేనికీ రావడం లేదు. బీఏసీ మీటింగ్కూ రాలేదు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ చిత్తశుద్ధి ఏందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తరో రారోనన్న అనుమానం ఉంది. నేను మాత్రం రాడేమోనని అనుకుంటున్న. సభకు వచ్చి ప్రతిపక్ష నేతగా ఆయన తన బాధ్యతలను నెరవేర్చాలని కోరుకుంటున్న” అని సీఎం తెలిపారు.
నిర్ణయం స్పీకర్దే
బీఏసీ మీటింగ్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ తరఫున కేసీఆర్, కడియం శ్రీహరి పేర్లను ఇచ్చారని, కేసీఆర్ బదులు హరీశ్రావు రావడమేమిటని సీఎం రేవంత్ ప్రశ్నించారు. అయినా హరీశ్రావును తామెందుకు మీటింగ్లో అడ్డుకుంటామని, ఆయన్ను మీటింగ్కు అనుమతించాలో లేదో నిర్ణయించాల్సింది స్పీకర్ అని పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు హరీశ్రావు లెక్కనే రేపు హిమాన్షు కూడా వస్తానంటడేమో... అనుమతిస్తరా” అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ఎల్వోపీ ఆఫీసు మార్పు స్పీకర్ నిర్ణయమేనని చెప్పారు.
ప్రొసీజర్ ప్రకారమే పోతం
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయంలో ఓ ప్రొసీజర్ ప్రకారమే ముందుకు వెళ్తామని, కేసీఆర్ అవినీతిపైనా ప్రొసీజర్ ప్రకారమే చర్యలుంటాయని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ‘‘కసబ్కు ఉరిశిక్షను కూడా ఓ పద్ధతి ప్రకారమే అమలు చేశారు. నేరుగా తీసుకొచ్చి కాల్చి చంపలేదు” అని ఆయన అన్నారు. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని తాము అనుకున్నామని, కానీ.. అది సాధ్యం కాదంటూ హైకోర్టు నుంచి తమకు లేఖ వచ్చిందని సీఎం చెప్పారు. విచారణకు రిటైర్డ్ జడ్జిని ఇస్తామన్నారని, దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
అవసరమనుకుంటే సభను స్పీకర్ పొడిగిస్తరు
అసెంబ్లీ సమావేశాలను పొడిగించాల్సిన అవ సరం ఉందనుకుంటే స్పీకర్ నిర్ణయం తీసుకుని పొడిగించే చాన్స్ ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. ముఖ్యమైన అంశాలపై చర్చించాలనుకుంటే సభను పొడిగించే అవకాశాలుంటాయని చెప్పారు. సభలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు. టీఎస్పీఎస్సీ విషయంలోనూ పూర్తిగా ప్రొసీజర్ను ఫాలో అవుతున్నామని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్లో నిరుద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పటిష్ఠమైన చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ నాన్ సీరియస్ పొలిటీషియన్ అని, అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నా రు. ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను కొట్టిపారేశారు..
బేసిన్లు లేవ్..భేషజాల్లేవ్ అనుడేంది?
అధికారంలో ఉన్నప్పుడు నీళ్ల విషయంలో ‘బేసిన్లు లేవ్.. భేషజాలు లేవు’ అని కేసీఆర్ అనడం తెలంగాణపై ఆయనకున్న కమిట్మెంట్ ఏమిటో అర్థమవుతుందని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. నాగార్జునసాగర్ను పోలీసులతో జగన్ ఆక్రమించారని, అయినా గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని ఆయన నిలదీశారు. రోజూ 12 టీఎంసీల నీళ్లను సాగర్ నుంచి ఏపీ తీసుకెళ్తున్నా కేసీఆర్ అడ్డుకోలేదన్నారు. కృష్ణా బేసిన్లోని ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించారని తెలిపారు.