
- పదేండ్ల విధ్వంసం, ఆర్థిక నేరాలను సభలో చర్చకు పెడ్తం
- గతమే మాట్లాడాలనుకుంటే మీ చరిత్ర ఎక్స్రే తీసి వివరిస్తం
- మేనేజ్మెంట్ కోటాలో కేటీఆర్ సీఎం అవుదామనుకున్నడు
- ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి సీఎం అయ్యేసరికి కుళ్లుకుంటున్నడు
- డ్రగ్స్ దందాలో ఎంతటి వారున్నా బొక్కలో వేస్తం
- గవర్నర్ చదివింది మా మేనిఫెస్టోనే.. గ్యారంటీలన్నీ అమలు చేస్తం
- ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ ఇస్తున్నం.. ధర్నాచౌక్లో కేటీఆర్ ఆమరణ దీక్ష చేసుకోవచ్చని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోని పాపాలన్నీ బయటకు తీస్తామని, గతం గురించి మాట్లాడాలని బీఆర్ఎస్ వాళ్లకు ఉంటే అందరి చరిత్రను ఎక్స్రే తీసినట్లు ప్రజలకు వివరిస్తామని మాజీ మంత్రి కేటీఆర్కు సీఎం రేవంత్రెడ్డి చురకలంటించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తమతో కలిసి రావాలని, లేకపోతే ప్రజలే బుద్ధిచెప్తారని అన్నారు.
‘‘మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్యేలు అయిన కొంత మందికి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎప్పటికీ అర్థం కాదు. అర్థం అయ్యేలా చెప్పేందుకు ప్రజలు ప్రయత్నించినా, వారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు” అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీ కూడా ఇచ్చామని.. అదే తమ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అని సీఎం చెప్పారు.
‘‘ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తాం అని మాట ఇచ్చినం. అమలు చేస్తున్నం” అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీనే అబద్ధాల పునాదులపై పుట్టిందని, ప్రభుత్వమూ అట్లనే ఏర్పాటై.. పాలనలోనూ అబద్ధాలే చెప్పారని ఆయన మండిపడ్డారు.
కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు స్పష్టమైన విలక్షణమైన తీర్పు ఇచ్చాక కూడా ప్రతిపక్షంలోనూ మళ్లీ కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చుకున్నారని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. సభలో కేటీఆర్, హరీశ్రావుతోపాటు బీఆర్ఎస్ సభ్యులు చేసిన కామెంట్లకు కౌంటర్లు ఇచ్చారు.
గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లెక్క ఉందని బీఆర్ఎస్ సభ్యులు అంటున్నారని, అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనేనని ఆయన చెప్పారు. ‘‘గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ మేనిఫెస్టోనే పొందు పర్చారని బీఆర్ఎస్ సీనియర్లు విమర్శిస్తున్నరు. గవర్నర్ ప్రసంగంలో ఏముంటుందో వారికి తెలియదా? పరిపాలనలో అనుభవం ఉన్నవాళ్లు, గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వారు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఏ ప్రభుత్వమైనా తమ విధానాలను గవర్నర్తో చెప్పిస్తుంది” అని గుర్తుచేశారు.
అచ్చోసిన ఆంబోతుల్లా కుస్తీ చేస్తమంటే కుదరదు
ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని సీఎం అన్నారు. మేనేజ్మెంట్ కోటా నుంచి వచ్చిన కేటీఆర్ ఓర్వలేకనే ఇప్పుడు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘మమ్మల్ని ప్రతిపక్షంలో ప్రజలు కూర్చోబెట్టారని, వాళ్లను అధికార పక్షంలో కూర్చోబెట్టారని కాంగ్రెస్ వాళ్లు మిడిసి పడాల్సిన అవసరం లేదు.
వారికి మాకు ఎక్కువ తేడా ఏమీ లేదు” అని సభలో కేటీఆర్ చేసిన కామెంట్లకు సీఎం కౌంటర్ ఇచ్చారు. ‘‘మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్యేలు అయిన కొంత మందికి ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదు. అర్థం అయ్యేలా చెప్పేందుకు ప్రజలు ప్రయత్నించినా, వాళ్లు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించరు. ప్రజాస్వామ్యంలో 49కి సున్నా వాల్యూ ఉంటది. 51కి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఉంటది. 51 శాతం ఉన్నవాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తరు. 49శాతం ఉన్నవాళ్లు ప్రతిపక్షంలో కూర్చుని.. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తరు.
ప్రభుత్వం పెడచెవిన పెడితే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తరు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేసిన సందర్భాలు కూడా ఉన్నయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలే తప్పితే.. వాళ్లు 64 ఉన్నరు, మేము 39 మందిమి ఉన్నమని అచ్చోసిన ఆంబోతుల్లా పోడియం దగ్గరికి వచ్చి కుస్తీ చేస్తమంటే వారి గౌరవానికి కుదరదు” అని హెచ్చరించారు.
కేసీఆర్ను మంత్రిని చేసింది కాంగ్రెస్
కేటీఆర్ తన ప్రసంగంలో ఉమ్మడి రాష్ట్ర పాలన గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్పై పదే పదే విమర్శలు చేయడంతో, ఆ అంశంపై రేవంత్ స్పందించారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కేసీఆర్ భాగస్వామి అనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ‘‘పదే పదే గత పాలకుల గురించి వారు(కేటీఆర్) మాట్లాడుతున్నరు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కేసీఆర్కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ.
సింగిల్ విండో డైరెక్టర్గా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కేసీఆర్ ఓడిపోయారు. అయినా, ఆయనను ఎంపీగా గెలిపించి, ఆయనకు కేంద్రంలో షిప్పింగ్ మినిస్టర్గా, కార్మిక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యే కాకపోయినా హరీశ్రావును మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి సహకరించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. వైఎస్సార్ నాయకత్వం దేశానికి అవసరమంటూ ఆయన ప్రభుత్వంలో హరీశ్రావు మంత్రిగా పనిచేశారు” అని గతాన్ని సీఎం రేవంత్ గుర్తుచేశారు.
‘‘పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుకు పొక్క కొట్టి, ఆంధ్రకు నీళ్లు తరలించుకు పోతునప్పడు కాంగ్రెస్లో ఉన్న పి.జనార్దన్రెడ్డి మాత్రమే కొట్లాడారు. కానీ, అప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీఆర్ఎస్ వాళ్లు కొట్లాడలేదు” అని అన్నారు. నాడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని సీఎం రేవంత్ అన్నారు. ‘‘కేసీఆర్కు గురువైన చంద్రబాబు నాయుడుతో నాడు పొత్తు పెట్టుకుని కేటీఆర్ ఎమ్మెల్యే అయిండు. తెలంగాణ ఉద్యమకారుడు కేకే మహేందర్రెడ్డికి అన్యాయం చేసి, ఎన్ఆర్ఐ కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చి ఆ నియోజకవర్గాన్ని ఆక్రమించుకున్నడు.
అట్ల కేటీఆర్ ఇక్కడి వరకూ వచ్చిండు. 2014 జూన్ 2వ తేదీ తర్వాత జరిగిన పాలన గురించి ఇక్కడ చర్చించాలి. కానీ, గతం గురించి మాట్లాడుతామంటే.. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, హరీశ్రావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, గంగుల కమలాకర్ సహా అందరూ అప్పటి పాలనలో భాగమే. గతం గురించి మాట్లాడాల్నంటే అందరి లిస్టు చదువుతం. మాకు ఐదు సంవత్సరాల సమయం ఉంది. సంపూర్ణంగా అన్నిటినీ ఎక్స్రే తీసినట్లు వివరిస్తం.
గత పదేండ్లలో జరిగిన విధ్వంసం, ఆర్థిక నేరాలను సభలోనే చర్చకు పెడ్తం. సంయమనం పాటించి తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలనుకుంటే మాతో కలిసి ముందుకు రావాలి. సభను సజావుగా సాగనివ్వండి. సలహాలు సూచనలు ఇవ్వండి, మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప పిల్లి శాపనార్థాలు పెడితే, ఉట్లు తెగిపడవు” అని బీఆర్ఎస్ సభ్యులకు సీఎం రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు.
కేటీఆర్.. నిజంగానే సిగ్గుపడు
పదో తరగతి పరీక్షలను కూడా బీఆర్ఎస్ సర్కారు సరిగ్గా నిర్వహించలేకపోయిందని, ఇంటర్ ఎగ్జామ్స్ తప్పులతో పిల్లల ఉసురు తీసుకున్నదని సీఎం రేవంత్ అన్నారు. ‘‘టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో లభ్యమయ్యే స్థితికి తీసుకువచ్చి నియామకాలను సక్రమంగా నిర్వహించలేని బీఆర్ఎస్సోళ్లు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. చేసిన పనులకు తలదించుకోవాల్సిందే” అని పేర్కొన్నారు. ఓటమి తర్వాతైనా బీఆర్ఎస్ నేతల్లో మార్పు వస్తుందని ఆశించామని, అయినా అది కనిపించడం లేదని సీఎం అన్నారు.
‘‘కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడైనా శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాను ఇతరులకు ఇస్తారనుకున్నా. కానీ, సభలో ఆ ఒక్క కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారు. ‘మా పార్టీ మా ఇష్టం’ అనేది ఎక్కువ కాలం చెల్లదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం.. కడుగుతామని శ్రీశ్రీ చెప్పారు. నిరంకుశత్వం ఎక్కువ కాలం ఉండదు.
ప్రజలు నిటారుగా నిలబడి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. గవర్నర్ ప్రసంగంపై సిగ్గు పడుతున్నట్లు కేటీఆర్ అంటున్నరు.. నిజంగానే ఆయన సిగ్గుపడాలి. ఇసుక దోపిడీలో వాళ్ల పాత్రపై సిగ్గుపడాలి. వేలాది లారీలతో కేసీఆర్ కుటుంబం ఇసుక దోపిడీకి పాల్పడింది. ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలపై కేసులు పెట్టి హింసించారు. దళితులను లాకప్లలో పెట్టి కరెంట్ షాక్ ఇచ్చి బాధపెట్టారు. పోలీసులను పెట్టి నిర్బంధానికి గురిచేశారు” అని ఆయన అన్నారు.
ప్రగతిభవన్లోకి హోంమంత్రిని కూడా రానియ్యలే
బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోకుంటే ఈసారి ప్రతిపక్షంలోకి కాదు ప్రజలు బయటకు పంపిస్తారని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ఇనుప కంచెను బద్ధలు కొట్టి 4 కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పిస్తూ ప్రజాభవన్గా మార్చామని, గడీలు బద్దలు కొట్టి ప్రజావాణికి జనం క్యూ కడుతుంటే బీఆర్ఎస్ నేతలు భరించలేకపోతున్నారని ఆయన అన్నారు.
‘‘గతంలో హోంమంత్రికి ప్రగతి భవన్లోకి ప్రవేశం లేదని గేటు దగ్గర నుంచే హోంగార్డు వెనక్కి పంపారు. ఆనాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సీఎంను కలిసేందుకు ప్రగతి భవన్కు వెళ్తే.. అనుమతి లేదని పోలీసులు వెనక్కి పంపించారు. సీఎంను కలిసేందుకు వెళ్లిన ప్రజాగాయకుడు గద్దర్ను కూడా అదే విధంగా అవమానించారు.
ఎర్రటి ఎండలో గంటల కొద్దీ గద్దర్ను ప్రగతిభవన్ గేటు వద్ద నిలబెట్టారు. ఈ ఘటనలన్నీ తెలంగాణ ప్రజలు గమనించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి.. ప్రమాణస్వీకారం రోజే ప్రగతి భవన్ కంచెను బద్దలుకొట్టాం. ప్రజలకు స్వేచ్ఛ కల్పించాం. ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఎవరైనా తమ సమస్యలు చెబితే వినేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని సీఎం తెలిపారు.
కేటీఆర్.. ఆమరణ దీక్ష చేసుకోవచ్చు
బీఆర్ఎస్ సభ్యుల్లో ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ వారిని కాదని ఒక కుటుంబ సభ్యులే సభలో మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ సెటైర్ వేశారు. ‘‘మీరు ఇట్లనే మాట్లాడుతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. సభను సజావుగా నడవనివ్వండి. గతంలో ఇదే సభలో ప్రశ్నించినందుకు మా సభ్యులను మార్షల్స్ తో బయటకు పంపించారు. ఇది గత ప్రభుత్వ ఘనకార్యం” అని అన్నారు.
‘‘అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతిభవన్కు పిలిచి గౌరవించారా? బుక్కెడు బువ్వ పెట్టారా ? ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన కుటుంబాలను ఎప్పుడైనా ఆదుకున్నారా? పదేండ్లు అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయలేదు. తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న డీఎస్పీ నళినికి ఎందుకు న్యాయం చేయలేదు.
కేసీఆర్ కుటుంబంలోని కుమారుడు, కుమార్తె, బంధువులకు మాత్రం పదవులు ఇచ్చారు. నిజామాబాద్ ఎంపీగా బిడ్డను ప్రజలు ఓడగొడితే.. మళ్లీ ఎమ్మెల్సీ ఇప్పించుకున్నడు. ఉద్యమ పార్టీ అని పదేపదే చెప్పే బీఆర్ఎస్ ధర్నాచౌక్ ఎత్తేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మేం ధర్నాచౌక్ను పునరుద్ధరించి తెలంగాణ ప్రజలకు హక్కులు కల్పిస్తే అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నరు. కావాలనుకుంటే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ధర్నాచౌక్లో ధర్నా చేసుకోవచ్చు. కేటీఆర్ ఆమరణ దీక్ష చేసుకోవచ్చు” అని సీఎం అన్నారు.
బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి పంపించం.. ఇదే వారికి శిక్ష
‘‘బీఆర్ఎస్ సభ్యులను ఎవరినీ ఎట్టిపరిస్థితుల్లో సభ నుంచి బయటకు పంపం. వారిని ఇక్కడే కూర్చో బెట్టి వాళ్లు ఏం చేశారో కఠోర నిజాలు వినిపిస్తం. వారికి ఇదే శిక్ష. వారిలో పరివర్తన రావాల్సిందే’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ప్రసంగం కొనసాగుతున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు అదేపనిగా అడ్డుపడ్డారు. దీనిపై రేవంత్ మాట్లాడుతూ.. వాళ్లను సభ నుంచి పంపే ప్రసక్తే లేదని అన్నారు.
డ్రగ్స్ మాట వింటే కాళ్లు వణకాలి
రాష్ట్రంలో డ్రగ్స్ను నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. సమాజాన్ని పీడిస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని, ఈ దందాలో ఎవరున్నా బొక్కలో వేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ మాట వింటే కాళ్లు వణికేలా చేస్తామన్నారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ భూతం లేదు. లిక్కర్ కేసులూ తక్కువే కానీ ఇప్పుడు సొంత రాష్ట్రంలో సింగరేణి కాలనీ మొదలు నగరం, రాష్ట్రమంతా డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నయ్.
డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఏమైంది? 2015 లో హైకోర్టులో నేనే పిటిషన్ వేశాను. డీఆర్ఐ, నార్కోటిక్స్ వింగ్ దర్యాప్తు జరిపించాలని కోరాను. దర్యాప్తు జరపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా నాటి ప్రభుత్వం ఫైళ్ళను దాచిపెట్టింది. ఇక డ్రగ్స్ అనే పదమే వినిపించొద్దు.. ఎంత పెద్దవారైనా, గొప్పవారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని పోలీసు అధికారులను ఆదేశించాం. డ్రగ్స్ ను వంద శాతం ఉక్కుపాదంతో నిర్మూలిస్తాం. స్థాయితో సంబంధం లేకుండా జైల్లో తోస్తం” అని తేల్చిచెప్పారు.
వరి వేస్తే ఉరి అని చెప్పి.. ఫామ్హౌస్లో వరి వేసిండు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల ఆదాయం పెరగలేదని.. అన్నదాతల ఆత్మహత్యలు, చావులు పెరిగాయని సీఎం రేవంత్ అన్నారు. ‘‘ఒకవైపు రైతులకు వరి వేస్తే ఉరి అని చెప్పి.. ఇంకోవైపు ఫామ్ హౌస్లో ప్రబుద్ధుడు కేసీఆర్ 150 ఎకరాల్లో వరి పండించిండు. రైతులేమో గిట్టుబాటు ధర రాక వడ్లను క్వింటాకు రూ.1,400, రూ.1,500 కు అమ్ముకుంటే.. అదే ఫామ్హౌజ్ వడ్లను క్వింటాకు రూ.4,250 కి అమ్ముకున్నడు.
దీనిపై విచారణకు సిద్ధమా?’’ అని సవాల్ విసిరారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేని అన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీనే ఇచ్చిందని.. మూమ్మాటికీ సోనియా గాంధీ చొరవతోనే రాష్ట్రం ఏర్పడిందని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిండు. అదే సమయంలో రాష్ట్ర ఏర్పాటు తరువాత సకుటుంబ పరివారంతో ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ కాళ్లకు దండం పెట్టి ఆ తర్వాత వెన్నుపోటు కూడా పోడిచిండు” అని ఆయన అన్నారు.
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే కార్యాచరణ
సభలో సీఎం ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ నేతలు రన్నింగ్ కామెంటరీ చేయడంపై సీఎం రేవంత్ మండిపడ్డారు. మేనేజ్మెంట్ కోటాలో వస్తే ఇలా సభలో రన్నింగ్ కామెంటరీ ఉంటుందని, తట్టుకునే సహనం ఉండదని అన్నారు. ‘‘ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆరు గ్యారంటీలకు ఆమోదం తెలిపాం. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే కార్యాచరణ రూపొందిస్తున్నాం. చట్టాలను ఈ సభ చేస్తుంది. మంత్రివర్గంలో తీసుకున్నవిధాన నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించేది ఈ సభ.
అందుకే రాబోయే రోజుల్లో ఆరు గ్యారంటీలను ఏ రూపంలో చట్టబద్ధత కల్పించాలన్నది ఇదే సభలో ప్రవేశపెట్టి ప్రతిపక్ష సభ్యుల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని చట్టం చేస్తం. ఈ తేడాను మేనేజ్మెంట్ కోటాలో వచ్చినవారు గమనించాలి”అని ఆయన సూచించారు. మేనేజ్మెంట్ కోటాలో సీఎం అవుదామనుకున్న వ్యక్తికి.. ప్రజల నుంచి వచ్చిన తాను సీఎం అయ్యేసరికి ఓర్వలేకపోతున్నారని, కుళ్లుకుంటున్నారని కేటీఆర్పై మండిపడ్డారు. ‘‘మేం పాలకులం కాదు.. సేవకులం. నాలుగున్నర కోట్ల ప్రజలకు సేవ చేసేందుకే ఇక్కడికి వచ్చాం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలామంది నా వద్దకు వచ్చి.. తమకు స్వాతంత్ర్యం వచ్చిందని.. వేరే ఏ యాప్ లేకుండా సాధారణ ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటున్నమని చెప్తున్నరు”అని ఆయన అన్నారు.
విద్యుత్ వినియోగంలో ఎక్కడ నెంబర్ వన్?
తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందంతా పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం పదో స్థానంలో ఉందని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ పార్టీ పుట్టింది అబద్ధాల పునాదుల మీదనే. ప్రభుత్వంలోకి అలానే వచ్చారు. పాలన కూడా అట్లనే చేశారు. కోటి ఎకరాలకు కాల్వల ద్వారా నీరు ఇస్తే పంపుసెట్ల సంఖ్య ఇంకా ఎందుకు పెరిగిందో సమాధానం చెప్పాలి? రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో బోర్ల సంఖ్య 19 లక్షలు ఉంటే ఇవాళ 29 లక్షలకు ఎట్లా చేరింది? కాల్వలతో నీళ్లు వస్తే రైతులు బోర్లు ఎందుకు వేసుకుంటున్నరు? గత పదేండ్లలో తెలంగాణలో 8వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నరని ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడైంది.
ఇదేనా మీ రైతు ప్రభుత్వం” అని బీఆర్ఎస్ సభ్యులపై ఆయన మండిపడ్డారు. రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందని తెలిపారు. ‘‘పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే రైతు ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదు. రైతు బతికి ఉన్నప్పుడు పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వం.. రైతు చనిపోయిన తర్వాత రూ.5 లక్షలు ఇచ్చింది. అదే పంటల బీమా అమలు చేసి ఉంటే.. రైతులు ఆత్మహత్యలకు, చావులకు దగ్గర కాకుండా ఉండేవారు. తెలంగాణ వచ్చాక కూడా కృష్ణా జలాలు ఎందుకు వినియోగించుకోలేకపోయాం? సొంత రాష్ట్ర పాలనలో కూడా పాలమూరు, చేవెళ్ల ప్రాంతంపై వివక్ష ఎందుకు కొనసాగింది? ప్రాణహిత –- చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం అందలేదు. వాళ్లు ఇప్పటికీ ఆందోళనలు చేస్తూనే ఉన్నరు” అని అన్నారు.