- మోదీ పరివార్లో ఈడీ, సీబీఐ, ఐటీ, ఈవీఎంలు
- ఇండియా పరివార్లో గాంధీ కుటుంబం, దేశ ప్రజలు
- కేరళ సీఎం విజయన్ అవినీతిలో మునిగిపోయిండు
- ఆయనకు, మోదీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ
- జూన్ 9న ప్రధానిగా రాహుల్ ప్రమాణం చేసుడు ఖాయమని ధీమా
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికలు రెండు పరివార్ల నడుమ సాగుతున్న పోరాటమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు ‘‘దేశంలో రెండు పరివార్ల మధ్య పోరాటం జరుగుతున్నది. మోదీ పరివార్లో ఈడీ, సీబీఐ, ఇన్కం ట్యాక్స్, ఈవీఎంలు, అదానీ, అంబానీ ఉన్నారు. ఇండియా పరివార్లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వయనాడ్ కుటుంబ సభ్యులు, దేశ ప్రజలు ఉన్నారు. ఇందిరా, రాజీవ్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారు.
జనం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు” అని ఆయన పేర్కొన్నారు. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేరళలో రెండోరోజు గురువారం కూడా రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు సభల్లో ప్రసంగించారు. మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, వారణాసి వర్సెస్ వయనాడ్ మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతున్నదని ఆయన అన్నారు. వయనాడ్ ప్రజలు ఓటు వేయబోయేది ఎంపీ అభ్యర్థికి మాత్రమే కాదని, దేశానికి కాబోయే ప్రధానికి అని పేర్కొన్నారు.
వయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీ వైపు ఉన్నారని తెలిపారు. రాహుల్గాంధీ కోసం తాను ప్రత్యే కంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ఆయనపై వయనాడ్ ప్రజల అభిమానాన్ని చూద్దా మనే తెలంగాణ నుంచి ఇక్కడికి(వయనాడ్) వచ్చానని రేవంత్ అన్నారు. ‘‘తెలంగాణ నుంచి పోటీ చేయాలని మేం రాహుల్ గాంధీని కోరాం. కానీ, వయనాడ్ వైపే ఆయన మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో వయనాడ్లో రాహుల్కు 65 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి 75 శాతం ఓట్లు రావాలి” అని పేర్కొన్నారు.
విజయన్ కమ్యూనిస్టు కాదు.. కమ్యూనలిస్టు
కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులు పూర్తిగా అవినీతిలో మునిగి పోయారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బంగారం స్మగ్లింగ్లో విజయన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉండడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. విజయన్ పై ఈడీ, ఆదాయపన్ను కేసులున్నా.. ఆయనపై మోదీ చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ప్రధాని మోదీతో కేరళ సీఎం విజయన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని, అందుకే ఆయన బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. ‘‘పైకి సీపీఎం ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్న పినరయి విజయన్ ... కమ్యూనిస్టు కాదు, కమ్యూనలిస్టు” అని ఆయన విమర్శించారు.
మతతత్వ బీజేపీతో కలిసి విజయన్ పని చేస్తున్నారని, వయనాడ్లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్కు కేరళ సీఎం విజయన్ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ‘‘సొంత పార్టీ సీపీఎంతో పాటు కేరళ ప్రజలను పినరయి విజయన్ మోసం చేస్తున్నరు. ఈడీ, ఆదాయపన్ను కేసులున్నన్ని రోజులు సీపీఎం కోసం విజయన్ పనిచేయరు. కేరళ రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం విజయన్ మాత్రం కేంద్రంతో ఎలాంటి పోరాటం చేయడం లేదు” అని విమర్శించారు.
కేరళ ప్రజలు కష్టపడే మనస్తత్వం కలిగినవాళ్లని, కేరళ ప్రజల శ్రమ వల్ల దుబాయ్ లాంటి దేశాలు అభివృద్ధి చెందాయని ఆయన తెలిపారు. కానీ, కేరళ అభివృద్ధి కాలేదని.. రాష్ట్రాల ప్రయోజనాలు, నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణ, కర్నాటక, జార్ఖండ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కేంద్రంతో నిధుల కోసం పోరాడుతున్నాయని తెలిపారు. మణిపూర్లో బీజేపీ గుండాల చేతిలో వందలాది మంది చనిపోయారని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్లో పర్యటించలేదని, కానీ రాహుల్ గాంధీ అక్కడి బాధితులను కలిశారని రేవంత్ తెలిపారు.