నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
  •     ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు 
  •     రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్‌‌ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం
  •     కేబినెట్‌‌ విస్తరణపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం

హైదరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్‌‌‌‌ ప్రాజెక్టులతో పాటు వివిధ అంశాలపై వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రుల అపాయింట్‌‌‌‌మెంట్లు కూడా కోరినట్లు తెలిసింది. 

మరోవైపు, రాష్ట్రంలో కేబినెట్‌‌‌‌ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై ఏఐసీసీ ముఖ్య నాయకులు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌‌‌‌తో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనుండటంతో రెండ్రోజుల పాటు రేవంత్‌‌‌‌ ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలిసింది. పార్లమెంట్‌‌‌‌లో ప్రస్తావించాల్సిన రాష్ట్రానికి చెందిన అంశాలపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

 ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. మరో ఆరుగురిని కొత్తగా కేబినెట్‌‌‌‌లోకి తీసుకునే అవకాశం ఉంది. పార్టీ సీనియర్ నాయకులు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రస్‌‌‌‌లో చేరిన వారు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌‌‌‌ పార్టీలో చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నేతలు ఎవరైనా పార్టీలోకి వస్తే వారికి మంత్రి పదవి లభించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇటు నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలిసింది.