
హైదరాబాద్: దేశంలో సిద్ధాంతపరమైన రాజకీయాలు కాకుండా ఎవరెంత వేగంగా డెలివరీ చేస్తారన్న ‘స్విగ్గీ పాలిటిక్స్’ తెరమీదకొచ్చాయని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిణామమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం (జూలై 26) హైదరాబాద్లో క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ, ICFAI సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి పేరిట నెలకొల్పిన స్మారక అవార్డును ప్రముఖ రచయిత, మోహన్ గురుస్వామికి అందించారు సీఎం రేవంత్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో ధన ప్రభావం పెరిగి ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధన ప్రభావం తగ్గి విలువలతో కూడిన సిద్ధాంతపరమైన రాజకీయాలు ఉండాలని చెప్పారు. సిద్ధాంతపరమైన రాజకీయాలకు సిద్ధాంతాలను నమ్మేవారు, పాటించేవారు, సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్లు దేశ రాజకీయాల్లో తగ్గుతూ వస్తున్నారు. ఇది దేశానికి, ప్రజాస్వామిక స్పూర్తికి ప్రమాదకరం. దేశం వేగంగా ప్రమాదం వైపు పయనిస్తుంది.
ALSO READ | జైపాల్ రెడ్డి లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు.. ఆయన సహకారం ఎప్పటికీ మరువలేం: CM రేవంత్
ప్రజాస్వామిక విలువలు తగ్గి పొలిటికల్ మేనేజ్మెంట్లు, పొలిటికల్ మేనేజర్స్ ఎక్కువయ్యారు. కార్యకర్తలు పోయి వాలంటీర్స్ వచ్చారు. కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం. యూనివర్సిటీల్లో సిద్ధాంతపరమైన విద్యార్థి రాజకీయాలు రావలసిన అవసరం ఉంది. దేశ రాజకీయాల్లో ధన ప్రభావం తగ్గాలి. వ్యక్తిగత రాజకీయాలకంటే సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలు ఉండే రాజకీయాలు ప్రజాస్వామిక విలువలను కాపాడుతుంది.రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి స్ఫూర్తి తెలంగాణ రాజకీయాల్లో ఉండాలి. వారి స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తాం” అని అన్నారు.
“జైపాల్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా.. వివిధ హోదాల్లో ప్రాతినిధ్యం వహించి సుదీర్ఘంగా సిద్ధాంతపరమైన రాజకీయాలు చేశారు. 1984 లో పార్లమెంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి 35 ఏళ్లు వెనుదిరిగి చూడకుండా దేశ రాజకీయాల్లో రాణించారు.
1969 లో అడుగుపెట్టి 50 సంవత్సరాలు 2019 చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పరిష్కారానికి, దేశ విధివిధానాలను అమలు చేయడంలోనే కృషి చేశారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న కీలక నిర్ణయాలు, అలాగే సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రసార భారత చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష గళాన్ని వినిపించే విధంగా ఒక బలమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు, పత్రికలకు కీలకమైన పాత్ర పోషించే అవకాశం కల్పించారు. తెలంగాణ నుంచి దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి బలమైన ముద్ర వేశారు.
జైపాల్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులే గానీ శత్రువులు ఎవరూ లేరు. సిద్ధాంతపరమైన రాజకీయాలే తప్ప ఆయన ఏనాడూ పదవులను ఆశించలేదు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకుని ఈ ప్రాంతానికే గౌరవం తీసుకొచ్చారు. తెలంగాణ నుంచి గొప్పగా రాణించిన స్వర్గీయ పీవీ నరసింహారావు తర్వాత జైపాల్ రెడ్డి చట్ట సభల్లో ఈ ప్రాంతానికి గుర్తింపు తెచ్చారు.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర విస్మరించలేనిది. ఆయన లేకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదు. ఆయన సమయస్ఫూర్తి, అనుభవం, ఉభయ సభల్లో బిల్లును ఆమోదింప జేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. రాజ్యసభలో సవరణలు ప్రతిపాదించినప్పుడు గాని, కేంద్ర కేబినేట్లో గాని జైపాల్ రెడ్డి చూపించిన చొరవ మరువలేనిదని కొనియాడారు.