
యాదాద్రి భువనగిరి: కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయంటూ ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. గంధమల్ల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు జిల్లాలో రూ.15 వందల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం తిర్మలాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్లో దెయ్యాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే అంటున్నారు.
ఇక నుంచి ఆ పార్టీ బీఆర్ఎస్ కాదు డీఆర్ఎస్. డీఆర్ఎస్ అంటే దెయ్యాల రాజ్య సమితి అని ప్రతిపక్ష పార్టీకి కొత్త పేరు పెట్టారు సీఎం రేవంత్. దెయ్యాలు, కొరివి దెయ్యాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పదేళ్లలో బంగారు తెలంగాణను బొందగడ్డగా మార్చారని బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాసాలమర్రిలో ఇండ్లు కూలగొట్టి స్మశానం చేశారు.. ఆ గ్రామ పరిస్థితి ఏంటో ఇప్పుడు చూడాలి. వాళ్ల ఫామ్ హౌస్కు రోడ్డు వేసుకోవడానికి నక్క జిత్తులు వేశారని ఫైర్ అయ్యారు.
రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంటే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏనాడైనా ఫస్ట్ తారీఖున జీతాలు పడ్డాయా అని ప్రశ్నించారు. మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. ప్రైవేట్ సెక్టార్లో యువతకు లక్ష ఉద్యోగాలు కల్పించామన్నారు. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా పేద విద్యార్థుల కోసం యంగ్ ఇండియా స్కూళ్లు నిర్మి్స్తున్నామని చెప్పారు.