ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవిలోనే నిర్ణయం : సీఎం రేవంత్

ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవిలోనే నిర్ణయం : సీఎం రేవంత్
  • లోక్​సభ ఎన్నికల తర్వాత చేపడతాం: సీఎం రేవంత్​
  • రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక
  • వన్య ప్రాణులకు హాని కలిగించకుండా ప్రత్యేక పర్యాటక విధానం
  • వచ్చే వానాకాలం​లో 22 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం
  • కాలుష్యం లేని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తాం
  • ఐఎఫ్ఎస్ ల ఖాళీల భర్తీకి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని వెల్లడి
  • అటవీ శాఖ అధికారులతో సమీక్ష

హైదరాబాద్​, వెలుగు: పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నందున.. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల్లో సాధారణ బదిలీలపై నిర్ణయం ఉంటుందని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఒక్క అటవీ శాఖలోనే కాకుండా అన్ని విభాగాల్లోనూ ఏండ్లకేండ్లుగా ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగులను బదిలీ చేసేలా సాధారణ బదిలీలకు మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.  శుక్రవారం సెక్రటేరియట్​లో అటవీ  శాఖ అధికారులతో సీఎం రేవంత్​రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఏండ్లకేండ్లుగా ఒకే చోట పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని, అందుకు వీలుగా బదిలీలపై నిషేధం ఎత్తివేయాలని అధికారులు  సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీఎం  పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నందున,  ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బదిలీల ప్రక్రియపై నిర్ణయం తీసుకుందామని వారికి చెప్పారు. ఉద్యోగుల పిల్లల చదువులకు కూడా ఇబ్బంది లేకుండా వేసవిలోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.  

అటవీ శాఖ నుంచి డిప్యూటేషన్ పై వెళ్లి ఇతర విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే వెంటనే వారిని వెనక్కి రప్పించే చర్యలు చేపడుతామని చెప్పారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అటవీ శాఖ, పర్యాటక శాఖ సమన్వయంతో పని చేయాలని సూచించారు.  తెలంగాణలో అడవులతో ముడిపడి ఉన్న ప్రకృతి అందాలను, పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయస్థాయి గుర్తింపు సాధించేలా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. 

అవసరమైతే ప్రత్యేకంగా కన్సల్టెన్సీలను నియమించి, ప్రతిపాదనలు తయారు చేయించాలని చెప్పారు. ఉత్తర తెలంగాణలో కవ్వాల్, దక్షిణ తెలంగాణ వైపు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. వన్య ప్రాణులకు హాని కలిగించకుండా ప్రత్యేక పర్యాటక విధానం తయారు చేయాలని చెప్పారు. 

కాలుష్య నిబంధనలు పాటించే పరిశ్రమలకు ప్రోత్సాహం

కాలుష్య నిబంధనలు, ప్రమాణాలను పాటించే పరిశ్రమలను ప్రోత్సహించాలని సీఎం రేవంత్​ అన్నారు. ప్రతి ఏడాది పర్యావరణ దినోత్సవం లాంటి సందర్భాన్ని పురస్కరించుకొని జీరో పొల్యూషన్ పాటించే సంస్థలకు ప్రశంసా పత్రాలను అందించాలని అధికారులకు సూచించారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాలకు అందుబాటులో ఉండేలా సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్​, విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, ఎక్కడ అనువైన ప్రాంతాలున్నాయో పరిశీలించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అన్నారు.  

సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించి ప్లాస్టిక్ తయారు చేసే పరిశ్రమలకు నోటీసులు ఇవ్వాలని, భారీగా జరిమానాలు విధించాలని తెలిపారు. రాష్ట్రానికి మంజూరైన 81 మంది ఐఎఫ్ఎస్ పోస్టుల్లో ప్రస్తుతం 55 మంది మాత్రమే ఉన్నారని, మిగతా 26 ఐఎఫ్ఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చర్చకు రాగా, ఖాళీలు లేకుండా సరిపడే సంఖ్యలో ఐఎఫ్ఎస్ లను కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

చెట్ల నరికివేతతో ఖాళీ అయిన ప్రాంతాల్లో మొక్కలు

రాష్ట్రంలోని నర్సరీల్లో దాదాపు 22 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. వానకాలం ఆరంభం (జూన్​)లో వీటిని నాటేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అడవుల్లో చెట్ల నరికివేతతో ఖాళీ అయిన ప్రాంతాల్లో మొక్కలు నాటాలని, అవసరమైతే అక్కడే బోర్లు వేయించి నీరందేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఆక్రమణకు గురవుతున్న ఫారెస్ట్ ల్యాండ్ ల చుట్టూ కాంపౌండ్ వాల్ లేదా ఫెన్సింగ్ వేసి కాపాడే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

కేంద్రం నుంచి వచ్చే కాంపా నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం కార్యదర్శి చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.