- కొందరు తెలంగాణే టార్గెట్ అని అంటున్నరు..
- అక్కడ మమత వదిలి పెట్టారేమో..
- బీజేపీ నేతలకు సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్ఐటీ, ఈడీ, సీబీఐతో గెలవాలనుకుంటున్నారని ఫైర్
- రాష్ట్రంలో కరువు రావాలని కొందరు
- పక్క రాష్ట్రాలకు పోయి చేతబడులు చేస్తున్నరు..
- అయినా దేవుడి దయ మాపైనే.. అందుకే వర్షాలు పడ్డయ్
- చేతబడి తిరగబడితే అష్టదిగ్బంధనమే..
- ఫామ్హౌస్ నుంచి బయటకు రాలేకపోతున్నరు
- కూకట్పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్కు శంకుస్థాపన
- మైనార్టీస్ ఎక్స్లెన్స్ సమ్మిట్కు హాజరు
హైదరాబాద్, వెలుగు: బెంగాల్ కథలు తెలంగాణలో నడ్వయని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ‘‘ బెంగాల్లో గెలిచాం..తర్వాత టార్గెట్ తెలంగాణ అని కొంత మంది మాట్లాడుతున్నరు. అక్కడ మమత వదిలేశారేమో కానీ.. ఇక్కడ మా కార్యకర్తలు వదిలి పెట్టరని వాళ్లకు చెప్పిన. సీబీఐ, ఈడీ, ఐటీ, సర్లను ఉపయోగించుకుని గెలవాలని చూస్తున్నరు. సర్ పేరుతో ఓట్లను తొలగించాలని చూస్తున్నరు. వాళ్ల ఆటలు సాగనివ్వం’ అని బీజేపీ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో ‘ఇందిరమ్మ ఇండ్లు’ టవర్స్కు గురువారం సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మైనార్టీస్ ఎక్స్లెన్స్ సమిట్లోనూ పాల్గొని, మాట్లాడారు. ఎవరికి పట్టం కట్టాలో తెలంగాణ ప్రజలకు పూర్తి క్లారిటీ ఉన్నదని, ఈ వ్యవస్థలను వాడుకొని గెలవాలనుకుంటున్న వారికి చెక్పెడతారని ధీమా వ్యక్తం చేశారు.
పదేండ్లు అధికారంలో ఉన్నోళ్లు ఇలాంటి పనులా..?
రాష్ట్రంలో కరువు రావాలని కొందరు పక్క రాష్ట్రాలకు పోయి చేతబడులు చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో కరువు వచ్చి జనాలు చనిపోవాలని, ప్రభుత్వంపై బద్నాం పడాలనే దుర్మార్గమైన ఆలోచనతో కొంతమంది పక్క రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు ప్రాంతాలకు వెళ్లి అఘోరా పూజలు, చేతబడులు చేయిస్తున్నరు.. పదేండ్లు అధికారంలో ఉన్నోళ్లు ఇట్లాంటి పనులు ఎట్లా చేస్తరు? బుద్ధి సరిగ్గా లేకపోతే ఆ చేతబడి తిరగబడి అష్టదిగ్బంధం చేస్తుంది. అందుకే ఫామ్హౌస్ నుంచి బయటికి రాలేకపోతున్నారు’’ అని ఫైర్ అయ్యారు. ఎన్ని క్షుద్ర పూజలు చేసినా దేవుడు తమ వైపే ఉన్నాడని, ఎల్నినో ప్రభావంలోనూ వర్షాలు కురవడం, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టులు నిండడం ఆగలేదన్నారు.
పట్టణ పేదలందరికీ దశలవారీగా పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 22ఏ ప్రొహిబిటెడ్ లిస్ట్ కింద ఎవ్వరి సొంత జాగాలు పోవని, ఇందుకు తాను సంపూర్ణ బాధ్యత తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. సర్వే నంబర్లో కొంత ఇష్యూ ఉంటే మొత్తం సర్వే నంబర్ను 22ఏలో పెట్టే పద్ధతిని మారుస్తున్నామని చెప్పారు. బై నంబర్ల ద్వారా వివాదాస్పద భూములను మినహాయించి, పేదలు కొనుక్కున్న ఇండ్ల స్థలాలకు, కట్టుకున్న ఇండ్లకు రిజిస్ట్రేషన్లు అయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు రూ.కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
రెండేండ్లలో ఎంతో చేసినం..
గత పదేండ్ల పాలనను, తమ రెండేండ్ల పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. గత ప్రభుత్వ పథకాలు ఏవీ రద్దు చేయలేదని, అదనంగా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పేదకు 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని పశువులు, కోళ్లకు దాణాగా వేసే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పేదింటి పిల్లలు సన్నబియ్యంతో కడుపునిండా అన్నం తింటున్నారని అన్నారు.
పట్టణాల్లో భూమి లేని పేదల కోసం 55 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గ్యాస్ సిలిండర్ను రూ.500కే అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన నాసిరకం బతుకమ్మ చీరలను మహిళలు తోటల్లో పిట్టలను బెదరగొట్టేందుకు ఉపయోగించేవారని విమర్శించారు. తమ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు పుట్టింటి పండుగ సారె లాంటివని అన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు అందించామని తెలిపారు.
మహిళలను బస్సు ఓనర్లను చేసినం..
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి.. ఇప్పటివరకు రవాణా శాఖకు రూ.12 వేల కోట్లు చెల్లించామని రేవంత్రెడ్డి తెలిపారు. పొదుపు సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ ఇప్పించి, రూ.2,500 కోట్ల వడ్డీని ప్రభుత్వమే భరించిందని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోలు నడవడం లేదంటూ ధర్నాలు చేయించిన కుట్రదారులకు సమాధానంగా మహిళా సంఘాలకే వెయ్యి బస్సులు కొనిచ్చి వారిని యజమానులను చేశామని తెలిపారు.
మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లతోపాటు పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు అప్పగించి నెలకు రూ.5-6 లక్షల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రోలాంటి ఐటీ సంస్థల మధ్య శిల్పారామానికి సమీపంలో రూ.వెయ్యి కోట్ల విలువైన 3.5 ఎకరాల స్థలంలో ‘ఇందిరా మహిళా శక్తి స్టాల్స్’ను ఏర్పాటు చేసి, వారి ఉత్పత్తులను అమెజాన్ ద్వారా విక్రయించే అవకాశం కల్పించామని తెలిపారు.
కూకట్పల్లి అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..
కొడంగల్లో ఓడిపోయిన 4 నెలలకే మల్కాజ్గిరి లోక్సభకు పోటీ చేసినప్పుడు కూకట్పల్లి ప్రజలు, ముస్లిం బస్తీలవాసులు అండగా నిలిచి తనను గెలిపించారని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ప్రతిపక్ష ఎంపీగా నిధులు ఇచ్చే అధికారం తనకు లేకపోయినా.. ప్రస్తుతం సీఎంగా కూకట్పల్లి రుణం తీర్చుకునే అవకాశం లభించిందని చెప్పారు. ఈ ప్రాంతంలో రోడ్లు, ఫ్లై ఓవర్లు, చెరువుల పునరుద్ధరణ, స్కూళ్లు, కాలేజీలు, పరిశ్రమల ఏర్పాటుతోపాటు ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబును ఆదేశించినట్టు తెలిపారు.
మైనారిటీ విద్యార్థులకు సన్మానం..
బంజరాహిల్స్లోని కుమ్రం భీం ఆదీవాసీ భవన్ లో జరిగిన ‘ మైనారిటీస్ ఎక్సలెన్స్ సమిట్’లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మైనార్టీ యువతను, మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి ఐఐటీ, నీట్ తోపాటు పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను సీఎం రేవంత్రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘2028లోనో.. 2029 లోనో ఎన్నికలు జరగనున్నాయి. సర్లో ఓటు హక్కు కోల్పోతే అప్పుడు ఓటు వేయలేరు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 60 నుంచి 70 లక్షల ఓట్లను సర్పేరిట తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. 10 రోజులపాటు గల్లీ గల్లీలో ఇంటింటికీ వెళ్లండి.. ప్రతి ఒక్కరి ఓటును చెక్ చేయండి. ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా ఎన్నికల అధికారులకు వివరాలు ఇవ్వాలి. అర్హులకు సంబంధించి ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చూడండి. ప్రతి ఒక్కరూ ఒక రేవంత్ రెడ్డిగా మారి ఓటు హక్కును కాపాడాలి’ అని శ్రేణులకు సూచించారు.
మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే మైనారిటీల రిజర్వేషన్ తొలగిస్తామని అమిత్ షా అంటున్నారని, ముందు గుజరాత్లో తొలగించి చూపించాలని అప్పుడే తాను సవాల్ చేసినట్టు చెప్పారు. తమ ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్ పటిష్టంగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వంలో మైనారిటీలకు సముచిత స్థానం ఇస్తోందని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మైనారిటీ సభ్యుడిని నియమిం చామని తెలిపారు. తనకు హిందూ ముస్లింలు రెండు కండ్లలాంటివారని, ఇద్దరూ సమానమేనని అన్నారు.
మైనారిటీ యువత చదువుతోపాటు నైపుణ్యం సంపాదించాలని, జర్మనీ, జపాన్లాంటి దేశాల్లో ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, యువత స్కిల్స్పై ఫోకస్ పెట్టాలన్నారు. సర్టిఫికెట్ల కన్నా స్కిల్స్కే ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ , మైనార్టీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రెండేండ్లలో 70 వేల ఉద్యోగాలు
గత ప్రభుత్వం చేసిన రూ.8.11 లక్షల కోట్ల అప్పులకు నెలకు రూ.7 వేల కోట్లు, ఏటా రూ.75 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్ల వరకు అసలు, వడ్డీలు చెల్లిస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం రెండేండ్లలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పారు. ‘‘ఉద్యోగం కేవలం వేతన ప్రయోజనం కల్పించే వ్యాపకం కాదు.. సేవతో కూడిన భావోద్వేగం. ఇల్లు అంటే కేవలం భౌతిక నిర్మాణం కాదు.. ప్రేమలు, బంధాలు అల్లుకున్న పొదరిల్లు’’ అని సీఎం వివరించారు. ఏ రంగాన్నైనా స్వచ్ఛమైన మనసుతో బలోపేతం చేయాలనే సంకల్పానికి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని, ప్రజలే దేవుళ్లుగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
