కేసీఆర్ పాలనలో ఆరునెలల్లో 30 వేల కోట్ల భూములు స్వాహా

కేసీఆర్ పాలనలో ఆరునెలల్లో 30 వేల కోట్ల భూములు స్వాహా

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్​ఎస్​ పాలనలో జరిగిన భూదందా అంతా ఇంతా కాదు. అధికారం తమ చేతుల్లో ఉందన్న ధీమాతో గులాబీ లీడర్లు దొరికిన కాడికి దొరికినట్లు ప్రభుత్వ భూములను కబ్జా పెట్టారు. ధరణిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయల విలువైన సర్కారు ల్యాండ్స్​ను అప్పనంగా తమ పేర్ల మీదికి, తమ అనుచరుల పేర్ల మీదికి, తమ బినామీలైన ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదికి బదలాయించుకున్నారు. కోర్టు కేసులు నడుస్తున్న భూములను, భూదాన్ భూములను కూడా వదల్లేదు. ఒక్క గచ్చిబౌలి ఏరియాలోనే రూ. 57వేల కోట్ల విలువైన భూములను బీఆర్​ఎస్​ లీడర్లు పొతం పెట్టారు. 

నిరుడు జూన్​ నుంచి డిసెంబర్​ వరకు

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్న హైదరాబాద్​ సిటీ వెస్ట్​ ప్రాంతంలోని గ్రామాల పరిధిలో భారీ భూబాగోతం నడిచినట్లు తేలింది. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, గోపన్ పల్లి, గండిపేట, మహేశ్వరం, శంకర్ పల్లి మండలాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ప్రైవేట్ వ్యక్తులకు కొందరు అధికారులు బదలాయించినట్లు బయటపడింది. ఈ తతంగాన్ని 2022 జూన్, జులై నుంచి నవంబర్, డిసెంబర్ వరకు ముగించారు. ఈ ప్రాంతంలోని భూములు ఎకరా రూ.30 కోట్ల నుంచి 50 కోట్లు పలుకుతున్నాయి. ఒక్కో సర్వే నెంబర్​లో రూ. 200 కోట్ల నుంచి 5,500 కోట్ల విలువైన భూముల బదలాయింపు జరిగినట్లు తేలింది. 

ఒకే గ్రామంలో రూ.30 వేల కోట్ల భూమి..!

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి గ్రామంలోని సర్వే నంబర్​ 36, 37లో గల 600 ఎకరాల ప్రభుత్వ భూమిని వివిధ సంస్థలకు నాటి సర్కార్​ కట్టబెట్టింది. ఇందులో కొందరి పేర్ల మీద పట్టాలు కూడా చేసేసింది. ఇక్కడ ఎకరా రూ.50 కోట్లు పలు కుతుంది. ఈ లెక్కన ఈ ఒక్క గ్రామంలోనే రూ. 30 వేల కోట్ల విలువ చేసే భూముల గోల్​మాల్​ జరిగినట్లు తేలింది. 

హైదరాబాద్​ చుట్టూ ఇదీ దందా..!

  • హైదరాబాద్​ శివారు శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నెం. 63లో రూ. 2,100 కోట్ల విలువ చేసే 42 ఎకరాల (ఎకరా రూ. 50 కోట్ల వరకు పలుకుతున్నది) భూమి శేత్వార్ రికార్డుల ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్​గా చూపిస్తుండగా.. పట్టా ల్యాండ్​గా కన్వర్ట్ చేశారు. 
  • ఇదే మండలం గోపన్​పల్లి  సర్వే నంబర్ 124లోని ల్యాండ్​ ప్రభుత్వ భూమిగా చూపిస్తుండగా.. 124/10, 11 సర్వే నెంబర్లోని 50 ఎకరాలను (ఎకరా రూ.40 కోట్లు) పట్టాగా మార్చేశారు.  
  • శంకర్​పల్లి మండలం వట్టినాగులపల్లిలోని సర్వే నెం. 186, 187 లోని 20 ఎకరాల (ఎకరా రూ. 20 కోట్లు) భూదాన్ భూములను నాటి బీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనుచరులకు అధికారులు పట్టాలు చేశారు.
  • గండిపేట్​ మండలం ఖానాపూర్​లోని బిలా దాఖల భూములకు సర్వే నంబర్ సృష్టించి 150 ఎకరాలను ఓ రిసార్ట్​కు పట్టా చేశారు.
  • మియాపూర్​లోని సర్వే నెం. 69లో గల 27 ఎకరాల భూమి (ఎకరా రూ. 50 కోట్లు), గచ్చిబౌలిలోని సర్వే నెం. 38 నుంచి 54లో గల 76 ఎకరాల అర్బన్ సీలింగ్ సర్ ప్లస్ భూమిని (ఎకరా రూ. 50 కోట్లు) ఐదు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారు. 
  • మహేశ్వరం, తుమ్మలూరు గ్రామాల మధ్యలో ఉన్న 70 ఎకరాల ప్రభుత్వ భూమిని (ఎకరా రూ. 3 కోట్లు) నాటి ఓ మంత్రి  బినామీ పేరిట పట్టా చేశారు.
  • శేరిలింగంపల్లి గ్రామంలోని సర్వే నంబర్​ 90, 91 నుంచి 102 వరకు ఉన్న 110 ఎకరాలు (ఎకరా రూ. 50 కోట్లు), మాదాపూర్ లోని సర్వే నంబర్​ 68, 64లో గల ఐదెకరాలు (ఎకరా రూ. 60 కోట్లు), హఫీజ్ పేటలోని సర్వే నంబర్​ 80, కొండాపూర్​లోని సర్వే నంబర్​ 87, 88లో గల 10 ఎకరాల (ఎకరా రూ. 50 కోట్లు) భూమిని ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.  మోకిల, కొండకల్ గ్రామాల మధ్యలో ఉన్న ల్యాండ్స్​కు కొత్తగా 555 సర్వే నంబర్​ను క్రియేట్ చేసి 150 ఎకరాలు (ఎకరా రూ. 30 కోట్లు) కూడా ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.