
హైదరాబాద్: రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయడానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా, నిర్ణీత గడువులోగా నివేదిక రూపొందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో గోశాలల ఏర్పాటు, నిర్వహణ, సంరక్షణ, అభివృద్ధి వంటి అంశాలపై శనివారం (మే 31) కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. గోశాలల నిర్మాణం, నిర్వహణ, సంరక్షణ కోసం పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.
గోసంరక్షణ, వాటి నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు జరగాలని చెప్పారు. మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. గోశాలల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని, కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
బంధించినట్టుగా ఇరుకు స్థలాల్లో కాకుండా మేతకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా గోశాలలు ఉండాలన్నారు. గోశాలల నిర్వహణ, సంరక్షణ విషయంలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను సీఎం పరిశీలించి పలు మార్పులు సూచించారు. మరో నాలుగైదు రోజుల్లోగా తుది మోడల్ను ఖరారు చేయాలని ఆదేశించారు.